Jitta Balakrishna Reddy | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బాలకృష్ణారెడ్డి, రాజేందర్ గులాబీ గూటికి చేరారు. వీరిద్దరికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా జిట్టా బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్లోకి తనను ఆహ్వానించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తుంటే ఒళ్లు పులకరించింది. సీఎం కేసీఆర్ తనను మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు చెప్పారు. రామన్న, హరీశ్ అన్న నాయకత్వంలో అడుగులో అడుగేసి నడుస్తానని స్పష్టం చేశారు. గౌరవం ఉన్నచోటుకే ఉద్యమకారులంతా రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొద్దామన్నారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జిట్టా బాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.