జగిత్యాల, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ కిట్ పథకం స్ఫూర్తితోనే తమిళనాడు సీఎం విజయ్ సర్కార్ దవాఖానలో పుట్టిన పిల్లలకు గ్రాము బంగారం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారని కొనియాడారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు రాయికల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2023లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలను అబద్ధపు ఆశల పల్లకిలో ఊరేగించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
కేసీఆర్ నేతృత్వంలో పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తే, సీఎం రేవంత్రెడ్డి సర్కార్ ప్రతి క్వింటాల్పై 8 కిలోల చొప్పున కోతకోసి, రైతును దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను సైతం కాంగ్రెస్ పార్టీలో తప్పుడు ప్రచారం చేయడంతోనే ఓడిపోయానని చెప్పారు. అధికార పక్షంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నా ప్రజాసమస్యలపై స్పందిస్తానని చెప్పారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఓటరునూ కలిసి ‘సర్’పై అప్రమత్తం చేయాలని సూచించారు. 2028లో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ఈ నెల 7న జగిత్యాలలో నిర్వహించే కేటీఆర్ సమావేశానికి కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.