హైదరాబాద్ : బీజేపీ రాజకీయ పార్టీలా లేదని, సర్కస్ కంపెనీలా మారిందని.. సంజయ్ సర్కస్ కంపెనీ షోలు నిర్వహిస్తున్నారని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ జీవన్రెడ్డి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పుడు బాంబే సర్కస్ కంపెనీ అని విన్నామని, దాన్ని బీజేపీ మించిపోయిందన్నారు. బీజేపీ సీఎంలు, జాతీయ నాయకులు సర్కస్ కంపెనీలో జోకర్లుగా మారారన్నారు. వార్డు మెంబర్గా గెలువలేని జాతీయ నేత మురళీధర్రావు కూడా కేసీఆర్ను విమర్శిస్తున్నారన్నారు. రేవంత్రెడ్డి పార్లమెంట్లో ప్రశ్న అడిగితే కాళేశ్వరంలో అవినీతి జరుగలేదని కేంద్రం బదులిచ్చిందని, టికెట్లు అమ్ముకున్న మురళీధర్రావుపై పోలీస్స్టేషన్లలో కేసులున్నాయని, కేసీఆర్ ఉద్యమకారుడని, కేసీఆర్ను టచ్ చేయాలని చూస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందన్నారు.
మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా ఉన్న మురళీధర్రావు ఆ రాష్ట్రానికి వెళ్లలేడని, శివరాజ్ సింగ్ దొంగదారిలో సీఎం అయ్యాడని ఆరోపించారు. అసోం సీఎం హేమంత బిశ్వా శర్మ కాంగ్రెస్లో బీజేపీ కోవర్టుగా ఉండి తర్వాత బీజేపీలో చేరి సీఎం అయ్యాడని, శర్మ తప్పుడు ప్రచారాలకు గతంలో ఫేస్బుక్ ఆయనను బ్యాన్ చేసిందని గుర్తు చేశారు. అలాంటి దిగుమతి నేతలా సీఎం కేసీఆర్ మీద మాట్లాడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ నేతలకు కళ్లు లేవని, అందుకే తెలంగాణ అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఆ పార్టీ నేతలకు ఒంటి నిండా కుళ్లు మాత్రమే ఉందన్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ తెలంగాణ సరిహద్దు మహారాష్ట్ర గ్రామాల ప్రజలు నిలదీస్తారని.. ఆయన మహబూబ్నగర్ సభకు ముఖం చాటేశారన్నారు. సంక్రాంతికి గంగిరెద్దుల వచ్చినట్లు ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు తెలంగాణ వచ్చి అడ్డమైన అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి చేసింది సున్నా అని, రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా చోద్యం చూస్తున్నారని జీవన్రెడ్డి విమర్శించారు.
దమ్ముంటే కేసీఆర్ పథకాలను ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ ఇచ్చే దమ్ము బీజేపీ కుందా? అని ప్రశ్నించారు. ఓట్ల కోసం సీట్ల కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తుందని, హేమంత బిశ్వ శర్మ లాంటి దుర్మార్గుడు కేసీఆర్లాంటి నేతను అరెస్టు చేస్తామంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా?
అన్నారు. కేసీఆర్ మూడు ఫేజ్ల కరెంటు లాంటోడని, ముట్టుకుంటే బీజేపీ బద్దలు కాక తప్పదన్నారు. తెలంగాణ గాంధీ కేసీఆర్ను అరెస్టు చేయడం బీజేపీ తాత, జేజమ్మలతో కూడా కాదన్నారు.
కర్ణాటక, మహారాష్ట్రలోని గ్రామాలు కూడా తెలంగాణలో కలుస్తామంటున్నాయని, జాతీయ రాజకీయాలు ఖచ్చితంగా మారుతాయన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే యూపీలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ కూడా అవసరమైతే యూపీలో ప్రచారం చేస్తారని, హుజురాబాద్లో బీజేపీ దగ్గర సుపారీ తీసుకున్న రేవంత్ రెడ్డి మా గురించి మాట్లాడడమేంటి? అని ప్రశ్నించారు.
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యేలను కొనేందుకు రేవంత్రెడ్డి చంద్రబాబు దగ్గర సుఫారీ తీసుకోలేదా ? సుఫారీలు, సెటిల్మెంట్లు, దందాలు, బ్లాక్ మెయిల్ రేవంత్రెడ్డి అలవాటని, రేవంత్ బీజేపీకి బీ టీం ఆరోపించారు. చంద్రబాబు దగ్గర సుపారీ తీసుకుని తెలంగాణ ఉద్యమంలో తుపాకీ ఎక్కు పెట్టింది రేవంత్ కాదా? అని ప్రశ్నించారు. ఫాదర్ ఆఫ్ సుపారీ రేవంత్ అని, వ్యవసాయ అభివృద్ధిపై ఆర్టీఐ కింద సమాచారం తీసుకుంటే చాలు చర్చ అవసరం లేదన్నారు.