హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం పచ్చగా ప్రగతిపథంలో పరుగులు పెడుతుంటే ప్రతిపక్ష పార్టీలు మిడుతల దండులా విరుచుకుపడ్డాయని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ జనరంజక పాలనపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ జలగల్లా తయారయ్యారని ధ్వజమెత్తారు. బుధవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్నది పాదయాత్రకాదని, అజీర్తియాత్ర అని మండిపడ్డారు. రాష్ర్టానికి ఏమీ ఇవ్వని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆయన ఢిల్లీ యాత్ర చేయాలని సూచించారు. తొండిమాటలు మాట్లాడే బండికి హుజూరాబాద్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల రంగాన్ని ప్రపంచ పటంలో సగర్వంగా నిలబెట్టిన మంత్రి కేటీఆర్పై అసత్య ప్రచారాలు చేస్తూ బీజేపీ నేతలు బండి సంజయ్, రఘునందన్రావు పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రంచేత ధాన్యం కొనుగోలు చేయించాలని, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి చేయాలని డిమాండ్చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత గురించి మాట్లాడే నైతిక హక్కులేదని జీవన్రెడ్డి అన్నారు. అర్వింద్ అబద్ధాలకు తాత.. అక్రమార్జనలో విజేత అని ఎద్దేవా చేశారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే ఆ రాష్ర్టానికి ప్యాకేజీలు ప్రకటించే అవకాశవాద సంస్కృతి బీజేపీదని విమర్శించారు.
రేవంత్ మరో కలెక్షన్ సైరన్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ మరో కలెక్షన్ సైరన్ ఊదారని జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు తాను జంగ్సైరన్ ఊదానని రేవంత్ పేర్కొనటాన్ని జీవన్రెడ్డి ఖండించారు. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి పేరు ఎత్తే నైతిక హక్కు రేవంత్కు లేదని, రాష్ర్టాన్ని సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేసిన కారణంగానే 1,200 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన నీచుడు రేవంత్, ఇవ్వాళ అదే అమరవీరుల పేర్లను ఉచ్చరిస్తూ లబ్ధిపొందాలని చూడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్ది పదవి పోరాటమని, సామంతరాజుల సంస్కృతికి ఆయన నిజమైన వారసుడని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు దమ్ముంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల ఫలితాలు రాగానే బండి సంజయ్, రేవంత్రెడ్డి ఎర్రగడ్డ మెంటల్ దవాఖానలో చేరటం ఖాయమని వ్యాఖ్యానించారు. రెండు పార్టీల కార్యాలయాలకు త్వరలో టు లెట్ బోర్డులు తప్పవని పేర్కొన్నారు.
ఎల్లకాలం మాదే పాలన: ఎగ్గె మల్లేశం
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని ఎత్తులేసినా ఎల్లకాలం రాష్ర్టాన్ని పాలించేది టీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం తేల్చిచెప్పారు. హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేక పోటీచేస్తదో చేయదో తెలుస్తలేదని, బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి కాంగ్రెస్, బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.