హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): ఐఐటీలు, ఎన్ఐటీలు సహా ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-1కు 95.8% మంది విద్యార్థులు హాజరయ్యారు. నిరుడు కూడా ఇంతేశాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావడం గమనార్హం. నిరుడు 8.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 8.23 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఏడాది 12.21 లక్షలకు 11.70 లక్షల మంది హాజరయ్యారు. పేపర్-2 పరీక్షను ఈ ఏడాది రికార్డు స్థాయిలో 75 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ ఏడాది జేఈఈకి దరఖాస్తు చేసిన వారిలో 66 శాతం మంది అబ్బాయిలే ఉన్నారు. ఈ నెల 12న జేఈఈ మెయిన్-1 ఫలితాలు విడుదలకానున్నాయి.
జేఈఈ మెయిన్-2 సెషన్ పరీక్ష తేదీలను మార్చినట్టు ఎన్టీఏ శనివారం ప్రకటించింది. తొలుత ఈ పరీక్షలను ఏప్రిల్ 1 నుంచి 15 వరకు నిర్వహిస్తామని వెల్లడించగా, తాజాగా వీటిని ఏప్రిల్ 4 నుంచి 15 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నది. మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది.