నల్లగొండ ప్రతినిధి/వరంగల్ (నమస్తే తెలంగాణ)/గద్వాల, నవంబర్18: నల్లగొండ, వరంగల్, గద్వాలలో శనివారం బీజేపీ అగ్రనేత, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్షా పాల్గొన్న సకల జనుల విజయ సంకల్ప సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అమిత్షా రాక ముందు జనం బయటకు బారులు తీయగా.. ఆయన వచ్చాక కూడా అలాగే వెళ్తూ కనిపించారు. ఖాళీ కుర్చీలను చూస్తూనే అమిత్షా ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రసంగంలోనూ కొత్తదనం, స్థానిక అంశాలు లేకపోగా ఎప్పటిలాగే కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసి సరిపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల తరఫున.. నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో, వరంగల్లోని ఖిల్లావరంగల్ వాకింగ్ గ్రౌండ్లో, గద్వాల నియోజకవర్గ కేంద్రంలో సకల జనుల విజయ సంకల్ప సభలు నిర్వహించారు.
ఈ సభలకు జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. వచ్చిన వారు కూడా మధ్యాహ్నం ఒంటి గంట వరకే సభాస్థలికి వచ్చి వెళ్లిపోయారు. అమిత్షా వేదికపైకి వచ్చేసరికి చాలా వరకు కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఖాళీ కుర్చీల మధ్యనే అమిత్షా ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగంలోనూ పస లేదని ఆ పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురైనట్టు సమాచారం. ఎప్పటిలాగే సీఎం కేసీఆర్ను విమర్శించాలి కాబట్టి అదే ధోరణితో ప్రసంగించి వెళ్లిపోయారు. కానీ.. బీజేపీ అభ్యర్థులను ఎందుకు గెలిపించాలి? స్థానికంగా ఉన్న అంశాలేమిటి? అనేది ఒక్కటి కూడా ప్రజలకు చెప్పలేకపోయారు. రాష్ట్ర నేతలు రాసిచ్చిన స్ట్రిప్టును చదివినట్టు స్పష్టమవుతున్నది.