జనగామ/హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జనగామ జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి (55) సోమవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. హనుమకొండలోని తన నివాసంలో చాయ్ తాగిన కొద్దిసేపటికే గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం గ్రామానికి చెందిన సంపత్రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్ఎస్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఉద్యమంలో ముందుండి పోరాడిన సంపత్రెడ్డి సేవలను గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ జడ్పీ చైర్మన్గా, జిలా ్లపార్టీ అధ్యక్షుడిగా జోడు పదవులను కట్టబెట్టారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత సోమవారం మధ్యాహ్నం స్టేషన్ఘన్పూర్లో తొలిసారి నిర్వహించిన మీడియా సమావేశంలో సంపత్రెడ్డి పాల్గొని అందరితో కలివిడిగా గడిపారు. కడియం గెలుపు సంబురాల్లో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న ఆయన స్వీట్లు పంచి ఉత్సాహంగా కనిపించిన కొద్దిసేపటికే కానరాని లోకాలకు వెళ్లడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి. పాగాల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయ నకు భార్య సుజాతారెడ్డి, కూతురు సంజనారెడ్డి ఉన్నారు. కుమారుడు సాయిరెడ్డి 2010 జూన్ 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో సంపత్రెడ్డి మానసికంగా బాగా కుంగిపోయారు.
కేసీఆరే దైవంగా..
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ అంటే సంపత్రెడ్డికి ఎంతో ఇష్టం.. ఆయన్ను దైవంగా భావిస్తారు. ఉద్యమ సమయంలో సంపత్రెడ్డిపై 28 కేసులు నమోదయ్యాయి. 2001లో పార్టీలో చేరిన సంపత్రెడ్డి 2002 నుంచి 2006 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా యువజన విభాగం ప్రచార కార్యదర్శిగా, 2006 నుంచి 2013 వరకు స్టేషన్ఘన్పూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా, 2013 నుంచి 2015 వరకు స్టేషన్ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. 2019 జూలై 5న చిల్పూరు జడ్పీటీసీగా ఎన్నికైన సంపత్రెడ్డి సేవలను గుర్తించిన కేసీఆర్ ఆయన్ను జనగామ జడ్పీ చైర్మన్గా ఎంపిక చేశారు. 2022 జనవరి 26న జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
సంపత్రెడ్డి మృతిపట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
సంపత్రెడ్డి హఠాన్మరణంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువనేత సంపత్రెడ్డి మరణం బాధాకరమని అన్నారు. పాగాల మృతిపట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సంపత్రెడ్డి మరణం పార్టీకి తీరనిలోటు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రి హరీశ్రావు తదితరులు సంతాపం ప్రకటించారు. ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సంతాపం తెలిపారు. జనగామ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.