Jangaon | ‘జనగామ ప్రాంతం ఒకప్పుడు కరువు నేల. నెర్రెలు బారిన భూముల్లో గరిక మొలవని దైన్యం. డొకలెండిన జీవులు.. గుకెడు నీళ్ల కోసం కొట్లాడుకున్నయ్. పక్షులు గూడొదిలి వెళ్లినట్టే మనుషులూ వలసపోయేటోళ్లు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారు. ఆ పనులన్నీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేస్తూ జనగామను ప్రగతి పథంవైపు నడిపించారు.
తొమ్మిదేండ్ల తర్వాత ఇప్పుడు ఎటుచూసినా ఆకుపచ్చని ఆవరణమే.. గుండెల నిండా సంబురమే.. గోదారమ్మ ఊరు పొత్తులసద్దిగా మారిన చిత్రం.. దేవాదుల రూపంలో సరికొత్త దారి దీపం పట్టి ఆహ్వానిస్తున్నది. రైతు మోమున చిరునవ్వు కాంతులీనుతున్నది. దశాబ్దాల క్రితం ఉపాధి కోసం ఊరు విడిచిన వాళ్లు తిరిగి తమతమ సొంతూళ్లకు సంబురంగా పయనం అయ్యేలా మారిన జీవనచిత్రం సరికొత్తగా ఆవిష్కృతమవుతున్నది.
ముత్తిరెడ్డి నేతృత్వంలో మురిసిన జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పల్లా రాజేశ్వర్రెడ్డి పోటీ చేస్తున్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తున్నది. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రజా సంక్షేమం కోసం మరిన్ని పథకాలు తీసుకువచ్చి అమలు చేస్తారనే నమ్మకం ఉన్న ప్రజలు బీఆర్ఎస్కు జైకొట్టనున్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేక చొరవతో నియోజకవర్గం ప్రగతిపథాన దూసుకుపోతున్నది. ఎన్నోఏండ్ల ఈప్రాంత ప్రజల చిరకాల కోరికైన జనగామ జిల్లా ఆవిర్భవించింది. సమీకృత కలెక్టరేట్ను నిర్మించారు. మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. ఏరియా దవాఖాన జిల్లా జనరల్ ఆసుపత్రిగా మారింది. మాతాశిశు సంరక్షణ కేంద్రం ద్వారా కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందిస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీలను మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు.. నేడు అద్దంలా మెరుస్తున్నాయి. బతుకమ్మకుంట మినీ ట్యాంక్ బండ్ జనగామకు మణిహారంగా మారింది. మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం క్రీడాకారులకు ఉపయోగపడుతున్నాయి. రూ.19 కోట్లతో చేర్యాల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం జనగామ సమీపంలోని చంపక్ హిల్స్పై రూ.400 కోట్లతో 400/220 కేవీ సబ్ స్టేషన్ను నిర్మించారు. బచ్చన్నపేట మండలం నారాయణపూర్లో 10 వేల కేవీఏ 132/33 కేవీ సబ్స్టేషన్, నర్మెట మండలం హన్మంతాపూర్లో 5 వేల కేవీఏ సబ్స్టేషన్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను పరిష్కరించారు.
వ్యవసాయం పండుగలా సాగుతున్నది. వందలాది చెరువులను పునరుద్ధరించారు. భూగర్భ జలాలు పెరిగాయి. పంటల దిగుబడి కూడా పెరిగింది. రైతుల అవసరాల కోసం జిల్లాలో 22 రైతువేదికలు, 570 ధాన్యం కల్లాలను నిర్మించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు 43 ట్రాక్టర్లు, 4 వరికోత యంత్రాలు, 24 రొటోవేటర్ అందజేశారు. మత్స్యశాఖ ద్వారా పంపిణీ చేసిన ఉచిత చేపపిల్లలు కాసులు కురిపిస్తున్నాయి. 10 దేవాదుల రిజర్వాయర్లు, చెరువుల్లో నూరుశాతం సబ్సిడీపై చేప పిల్లలను పోసిన ప్రభుత్వం మత్స్యకార్మికులకు ఉపాధి కల్పిస్తున్నది. గొర్రెల పెంపకం పథకంలో 6,180 కుటుంబాలకు లబ్ధిచేకూరుతున్నది. 85 మంది లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద 2,699 మంది పేదింటి ఆడబిడ్డలకు రూ.21.23 కోట్లు అందజేశారు.
డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకంలో ఇప్పటి వరకు 1234 ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయి. పచ్చదనం, పరిశుభ్రత, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు నిర్మించారు. మిషన్ భగీరథ పథకం ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరును అందిస్తున్నది. కంటి వెలుగు ద్వారా 13,570 మందికి అద్దాలు పంపిణీ చేశారు. 39,893 మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నారు.