హైదరాబాద్ : యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం జలవిహార్ ఎండీ రామరాజు కిలో బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తమను భాగస్వామ్యం చేసినందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అశోకుడు చెట్ల పెంపకం, రాణి రుద్రమ నీటిపారుదల వ్యవస్థ అభివృద్ధికి, రాజ రాజ చోళుడు దేవాలయాల నిర్మాణానికి పాటుపడ్డారు. సంస్కృతిని కాపాడేందుకు కృష్ణ దేవరాయలు విశేషమైన కృషి చేశారు.
మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హరితహారం, మిషన్ కాకతీయ, భగీరథతో పాటు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు. మహా చండీ యాగం చేశారు. ఇవన్నీ ఒక దశాబ్ద కాలంలోపే పూర్తి చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ శతాబ్దానికి ఒక సంస్కర్త, భగీరథుడు, చక్రవర్తి అని ఎండీ రామరాజు కొనియాడారు.
సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని యాదాద్రి దేవాలయానికి కేజీ బంగారం సమర్పిస్తున్నామని రామరాజు స్పష్టం చేశారు. యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ తొలుత తన వంతుగా కిలో 16 తులాల బంగారం విరాళంగా ప్రకటించిన విషయం విదితమే.