హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మంగళవారం బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్రీయ ఓబీసీ మహా సంఘ్ ఆధ్వర్యంలో ‘బీసీల మహాధర్నా’ చేపట్టారు. ఇందులో అన్ని రాష్ట్రాల బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ తరఫున ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేసి, బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేపట్టాలని, రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేంద్రం తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఇక తిరగబడతామని హెచ్చరించారు. ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పేరుకే బీసీ అని తొమ్మిదేండ్లలో బీసీలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే, నేటి వరకు దానికి అతీగతి లేదన్నారు. 60 శాతం ఉన్న బీసీలకు కేంద్ర బడ్జెట్లో అరశాతం కూడా నిధులు కేటాయించకుండా అవమానించారని మండిపడ్డారు. బీసీల పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కుమ్మర క్రాంతికుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.