హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): బీసీల సాధికారత సాధనే లక్ష్యంగా ఈ నెల 15న హైదరాబాద్ ఎల్బీనగర్లోని కేబీఆర్ కన్వెన్షన్లో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించనున్నుట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ డాక్టర్ కేశవరావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను బుధవారం ప్రతినిధి బృందంతో కలిసి ప్లీనరీకి ఆహ్వానించారు. అనంతరం జాజుల మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలు అనుసరించాల్సిన రాజకీయ వ్యుహాలపై చర్చించడంతోపాటు, బీసీల రాజకీయ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు.
ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు వివిధ ఇతర పక్షాల నేతలనూ ఆహ్వానించామని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూదాని సదానందం, రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం, మాదేశి రాజేందర్, భాసర్ తదితరులు పాల్గొన్నారు.