చిక్కడపల్లి, మే 4: బీసీ కుల గణనపై కాంగ్రెస్ వైఖరిని రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనలో ప్రకటించాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్, ఇంతవరకు బీసీ గణనపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
బీసీ గణనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ ఆధ్వర్యంలో కమిటీ వేసి ఏడాదైనా నివేదిక ఇవ్వలేదని, జాతీయపార్టీగా బీసీ గణనపై కాంగ్రెస్కు బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అడగాల్సిన కాంగ్రెస్ ప్రశ్నించటం లేదని, చేయాల్సిన బీజేపీ స్పందించడం లేదని విమర్శించారు. బీసీల ఆకాంక్షలను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోకపోతే 2023 ఎన్నికల్లో ఏ ముఖంతో ఓట్లడుగతారని ప్రశ్నించారు. బీసీల గురించి ఆలోచించని కాంగ్రెస్, బీజేపీలకు 60 కోట్ల మంది బీసీలు వచ్చే ఎన్నికల్లో తడాఖా చూపిస్తారని హెచ్చరించారు. సమావేశంలో మాదేశు రాజేందర్, బడేసాబ్, కులకచర్ల శ్రీనివాస్, బండిగాని రాజు, విక్రమ్ గౌడ్, కనకాల శ్యామ్ కురుమ, రాజు, ఇంద్రం రజక తదితరులు పాల్గొన్నారు.