Indrakaran Reddy : దేశంలోని రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో బీఆర్ఎస్ ఆవిర్భావించింది అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో జై కిసాన్ సంపూర్ణ సాకారం అవుతుందని, దేశంలో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న 70 శాతం మంది జీవితం మారుతుందని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్ల రైతన్నలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని, దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ కావాలని ప్రజలు బలంగా కొరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. హరితహారం వంటి కార్యక్రమాలతో పర్యావరణ పరిరక్షణలో మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ తరహాలో దేశ వ్యాప్తంగా కొత్త పర్యావరణ విధానం తేవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ప్రకటించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
21ఏళ్ల క్రితం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పడిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారి జాతీయ రాజకీయాల్లో నూతన శకానికి శ్రీకారం చుట్టిందని మంత్రి వెల్లడించారు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ద్వారా దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం ఆవిష్కృతం కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని, బీఆర్ఎస్ వల్లే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.