జగిత్యాల కలెక్టరేట్/జగిత్యాల రూరల్: జగిత్యా ల జిల్లా కేంద్రంలో గురువారం దారుణం చోటుచేసుకొన్నది. దుండగులు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాలలోని తారకరామనగర్కు చెందిన జగన్నాథం నాగేశ్వర్రావు (60) స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తూ సెప్టిక్ క్లీనింగ్ వాహనాన్ని నిర్వహిస్తుంటారు. గురువారం స్థానిక ఎరుకల సంఘ భవనంలో నిర్వహించిన కుల సంఘం సమావేశానికి నాగేశ్వర్రావుతోపాటు ఆయన కొడుకులు రాంబాబు(42), రాజేశ్, రమేశ్ (35) హాజరయ్యారు. సమావేశం జరుగుతుండగానే కొందరు వ్యక్తులు ఈ నలుగురిపై కత్తులు, బరిసెలతో అకస్మాత్తుగా దాడి చేశారు. నాగేశ్వర్రావును కత్తితో గొంతు కోయగా, రాంబాబు, రమేశ్ను బరిసెలతో పొడిచారు. తీవ్ర గాయాలపాలైన నాగేశ్వర్రావు, రాంబాబు అక్కడికక్కడే మృతిచెందారు. రమేశ్ను దవాఖానకు తరలిస్తుండగా మరణించాడు. రాజేశ్ త్రుటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురిని హత్య చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ హత్యలకు మంత్రాలు, ఆర్థిక లావాదేవీలు, సెప్టిక్ ట్యాంకుల నిర్వహణలో ఇతరులతో తలెత్తిన వివాదాలే కారణం కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
జఫర్గఢ్: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తీగారంలో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో కొందరు వ్యక్తులు బుధవారం రాత్రి ముగ్గురిపై దాడి చేశారు. గ్రామానికి చెందిన ఎండీ యాకూబ్ కోడలు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నది. అన్న గోరేమియా మంత్రాలు చేయడం వల్లే తన కోడలు అనారోగ్యానికి గురైందని అనుమానించిన యాకూబ్ తన బంధువులతో కలిసి అతనిపై కర్రలు, రాళ్లతో దాడి చేశాడు. అడ్డువచ్చిన వారిని కూడా తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడి లో గోరేమియాతోపాటు ఆయన కుమారులు ఎండీ హలీమ్, మక్తుమ్కు తీవ్ర గాయాలయ్యాయి.