కరీంనగర్/మంచిర్యాల/సిద్దిపేట, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జగిత్యాల నియోజకవర్గం జైకొట్టింది.. దుబ్బాక దండుకట్టింది.. ఖానాపూర్ జనం హోరెత్తగా, వేములవాడ నీరాజనం పట్టింది. మొత్తంగా ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా సభల్లో ఇందిరమ్మ రాజ్యం మాకొద్దు.. అన్న నినాదాలు హోరెత్తగా, ధరణి, 24 గంటల కరెంటు కావాలి అన్న ప్రజల నినాదాలు మిన్నంటాయి. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చ పెట్టాలంటూ సీఎం కేసీఆర్ ఆత్మవిశ్వాసంతో చెప్పిన మాటలు.. బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత అత్మవిశ్వాన్ని నింపాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం సాగినంత సేపు ఈలలు, కేరింతలతో జనం ఉప్పొంగిపోయారు. ఉద్యమాల గడ్డ జగిత్యాల, ఇలవేల్పు రాజన్న ఇలాకా వేములవాడలో ప్రజలు కదం తొక్కారు. తండోపతండాలుగా తరలివచ్చి బ్రహ్మరథం పట్టారు.
సభలకు తరలివచ్చిన జనంతో రెండు పట్టణాలు కిటకిటలాడాయి. అనేక అంశాలపై కేసీఆర్ ప్రజలకు వివరించి చెప్పిన తీరు ఆకట్టకున్నది. ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఈ ప్రాంత ప్రజలకు ఎదురైన అనుభావాలను కండ్లకు కట్టినట్టుగా వివరించిన తీరు అందరినీ ఆలోచింపచేసింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజాఆశీర్వాద సభ జనసంద్రాన్ని తలపించింది. పట్టణంలో ఎటు చూసినా జనమే కనిపించారు. జాన్సన్ నాయక్ను గెలిపిస్తే ఖానాపూర్ బాధ్యత తనదే అన్న కేసీఆర్ హామీకి జనం నుంచి చప్పట్ల వర్షం కురిసింది.
దుబ్బాక సభకు దుబ్బాక, దుబ్బాక టౌన్, మిరుదొడ్డి, రాయపోల్, తొగుట మండలా ల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దుబ్బాక అంటే ప్రేమ అని, అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదని.. కొత్త ప్రభాకర్రెడ్డిని గెలిపించే బాధ్యత మీది.. అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ప్రజలంతా గులాబీ కండువాలను గాల్లోకి ఊపుతూ హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు. నాలుగు నియోజకవర్గాల్లో ప్రజాఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుస్తారన్న ధీమా శ్రేణుల్లో వ్యక్తం కావడంతోపాటు.. పార్టీ నేతల్లో కొత్త జోష్ నిండుకుంది.