నల్లగొండ, ఏప్రిల్ 18 : ‘కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ బ్రోకర్లు.. పదవులు, డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతారు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి దుయ్యబట్టారు. నల్లగొండలో గురువారం ఆయన మాట్లాడుతూ రేవంత్ మెప్పు కోసం పోటీపడి ఆయన బూట్లు నాకుతున్నారని విమర్శించారు. కేసీఆర్ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని, ఆయన జోలికొస్తే ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. రాజకీయాన్ని వ్యాపారం చేసి పార్టీని, నమ్మినవాళ్లను మోసం చేసిన చీటర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ అని మండిపడ్డారు. రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ను మోసం చేసి బీజేపీ నుంచి పోటీ చేస్తే, కాంగ్రెస్లో ఉండి వెంకట్రెడ్డి తన తమ్ముడికి ఓటెయ్యాలని కోవర్టు రాజకీయాలకు పాల్పడలేదా? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి బ్రదర్స్కు నీతి, నిబద్ధత లేదని, వాళ్లు నల్లగొండ జిల్లాకు పట్టిన శని అని ఎద్దేవాచేశారు. డబ్బులిచ్చి పీసీసీ పదవి కొన్నాడని నాడు రేవంత్ను విమర్శించి, నేడు పదవుల కోసం తమను తామే అమ్ముకుంటున్నారని విమర్శించారు. ‘రేవంత్ 120 రోజులు కాదు గదా, 1,020 రోజులు పాలించినా ప్రయోజనం ఉండదు’ అని కుండబద్దలు కొట్టారు. రాహుల్గాంధీ దేశానికి దెయ్యం అని మోదీ అంటే, ‘బడేభా య్ సహకారంతో తెలంగాణను గుజరాత్కు రోల్ మాడల్ చేస్తా’మని చోటేభాయ్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘గుజరాత్ మాడల్ అంటే మర్డర్లు, ఆడపిల్లలపై అఘాయిత్యం చేసినోళ్లను జైళ్ల నుంచి విడిపించడం, కుల ఘర్షణలు, ఊచకోత కోయడమా?’ అని ప్రశ్నించారు. రేవంత్ త్వరలో బీజేపీలోకి పోతారని ఆయన మంత్రులే లీకులిస్తున్నారని తెలిపారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఉన్నారు.