హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): దశాబ్దకాలంలో రాష్ట్రంలో సమిష్టి కృషితోనే విద్యుత్తు రంగంలో ఎన్నో విజయాలు సాధించగలిగామని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎం ప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ ఎర్రగడ్డలోని టీఎస్ జెన్కో ఆడిటోరియంలో నిర్వహించిన విద్యుత్తు ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం తొలిగా సాధించింది విద్యుత్తు విజయమేనని, అది నేడు దేశానికే రోల్మోడల్గా మారిందని వివరించారు.
ఈ విజయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఉద్యోగులు పడిన శ్రమ దాగి ఉన్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విద్యుత్తు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. యావత్తు దేశంలోనే తలసరి విద్యుత్తు వినియోగంలో నెంబర్వన్గా నిలిచిన ఘనత తెలంగాణదేనని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి జగదీశ్రెడ్డి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు, డిస్కం సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్రావును జేఏసీ ప్రతినిధులు సత్కరించారు. జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్రావు, కో-చైర్మన్ శ్రీధర్, కో-కన్వీనర్ బీసీ రెడ్డి, వైస్ చైర్మన్ వజీర్, శ్యామ్సుందర్, తులసీ నాగరాణి, ఫైనాన్స్ సెక్రటరీ కరుణాకర్రెడ్డి, ఆర్గనైజింగ్ ప్రతినిధులు రాంజీ, సదానందం, నెహ్రూ, కలువల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.