Jagadish Reddy | సూర్యాపేట : దేశంలో ఆకలి దారిద్ర్యాలు లేని రాష్ట్రం తెలంగాణ అని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని 7వ వార్డు ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2లో బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు కొండేటి ఏడుకొండలు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి, దేశానికి శ్రీరామరక్ష అన్నారు. దేశవ్యాప్తంగా 30 శాతం మంది ప్రజలు ఒక్క పూట భోజనం మాత్రమే తింటూ మిగతాపూట పస్తులు ఉంటే, తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆకలి దారిద్ర్యాలను లేకుండా చేసిందన్నారు. దేశంలో నేటికీ రెండు పూటలా తిండి తింటున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు.
దేశంలో ఇంటింటికి 24 గంటల కరెంటు త్రాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికీ చాలా గ్రామాల్లో కరెంటు లైన్లు కూడా లేవన్నారు. దేశవ్యాప్తంగా అత్యధికంగా 45 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో సైతం 40 వేల మందికి పెన్షన్లు అందజేస్తున్నామన్నారు. మెడికల్ కాలేజ్, మినీ ట్యాంక్ బండ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు వేసిన ఓటు ద్వారానే వచ్చాయన్నారు. 2014 ముందు మూసీ ప్రాజెక్టు గేట్లు శిథిలావస్థకు చేరి నీరు వృధాగా పోతున్నా పట్టించుకున్న వారే లేరన్నారు. తాను గెలిచిన మరుక్షణమే ముఖ్యమంత్రి దృష్టికి మూసీ ప్రాజెక్టు దుస్థితిని తీసుకొచ్చి గేట్లను ఆధునీకరించామన్నారు. తద్వారా 30 వేల ఎకరాల్లోరూ. వెయ్యి కోట్ల విలువ చేసే పంటలు పండించారని తెలిపారు. సూర్యాపేట సుందరీకరణలో ఇంకా చేయవలసింది చాలా ఉందన్న మంత్రి, దేశంలో నెంబర్ వన్ పట్టణంగా సూర్యాపేటను తీర్చిదిద్దే యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఏడుకొండలు, మహిళా మోర్చా నాయకులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో పాల్వాయి వెంకన్న, శైలజ, పాపారావు, అశోక్, లక్ష్మయ్య, చారి, నిర్మల, శ్రీరాములు, సైదా, మరో 200 మంది బిజెపి కార్యకర్తలు, మహిళా మోర్చా నాయకులు ఉన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి బూర బాల సైదులు గౌడ్, కౌన్సిలర్లు భరత్ మహాజన్ భత్తుల జానీ, రాపర్తి శ్రీనివాస్, జానీ భాయ్, కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి పాల్గొన్నారు.