హైదరాబాద్: తెలంగాణకు ఏమైనా ద్రోహం జరిగిందంటే దానికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి బాధ్యులని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. నీళ్లలో నిప్పులు పుట్టించి ఉద్యమం నడిపిన పార్టీ తమదన్నారు. తెలంగాణపై అన్ని విషయాల్లో పరిశోధించిన నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస సోయి లేదని విమర్శించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్ల మల్లయ్య యాదవ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా నీళ్ల దోపిడీ జరుగుతున్నదని, అడ్డుకోవాలని హరీశ్ రావు సలహా ఇచ్చారన్నారు. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్లో వాటాకు మించి ఏపీ నీళ్లు తీసుకెళ్తున్నదని చెప్పారు. సాగర్ ఎడమ కాలువ కింద సాగు, తాగు నీటికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. మన హక్కుగా ఉన్న 123 టీఎంసీల గురించి మాట్లాడాలన్నారు. నీటి విషయంలో మంత్రులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలపై మాట్లాడటం మానేసి కేంద్రం, చంద్రబాబును ప్రశ్నించాలని సూచించారు. కాంగ్రెస్ అవినీతి గురించి ప్రజలే మాట్లాడుకుంటున్నారని చెప్పారు.
‘తెలంగాణ దాచిపెట్టుకున్న కృష్ణా నీళ్లను ఏపీ ఎత్తుకెళ్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. ఏపీ నీటి దోపిడీతో తెలంగాణలో సాగు, తాగు నీళ్లకు కటకట ఏర్పడే పరిస్థితి ఉందని హరీశ్ రావు చెప్పారు. ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ చెత్త మాటలు మాట్లాడారు. ఉత్తమ్వి ఉత్తరకుమార మాటలు. రాష్ట్రానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణలోనూ అన్యాయం చేసింది కాంగ్రెస్, బీజేపీలే. తెలంగాణకు సరైన నీటి వాటా దక్కకపోవడానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీలే కారణం. ఉత్తమ్ కుమార్ ఎవరో రాసిచ్చింది చదివారు. రేవంత్ రెడ్డి తిట్లతో సీఎం అయ్యారు. తాను కూడా అదే భాషతో మాట్లాడితే ముఖ్యమంత్రి అవుతానని ఉత్తమ్ అనుకుంటున్నారేమో.
పదేండ్ల కేసీఆర్ పాలనలోసాగు తాగు నీళ్లకు ఎలాంటి కష్టం రాలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడిన చెత్తనే కేసీఆర్ మీద ఉత్తమ్ మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడాల్సింది కేంద్రం మీద. పక్క రాష్ట్రం చంద్రబాబు మీద, ఏపీలో ప్రాజెక్టుల మీద. ప్రాజెక్టుల విషయంలో జగన్, చంద్రబాబు ఒకే వైఖరితో ఉన్నారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారు. పోతిరెడ్డిపాడును వ్యతిరేకించి ఆనాడు మా పార్టీ వైఎస్ కేబినెట్ నుంచి బయటకు వచ్చింది. మాట్లాడుకుంటే తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహ చరిత్ర చాలా ఉంది. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం ప్రయత్నిస్తున్నామని ఉత్తమ్ అంటున్నారు. ముందు ఉన్న పంటలను కాపాడటంపై దృష్టి పెట్టాలి. మోదీకి, చంద్రబాబుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారు.
జగన్ సీఎంగా రాష్ట్రానికి వస్తే గౌరవించుకోవద్దా. మీరు చంద్రబాబు దగ్గరికి క్యూ కట్టలేదా. మాట్లాడటానికి సిగ్గు ఉండాలి. కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుకుంటే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ప్రతి దాంట్లో కమిషన్ అడుగుతున్న కాంగ్రెస్ నేతలా కేసీఆర్ గురించి మాట్లాడేది. మంత్రుల అవినీతి సంపాదన చిట్టా మా దగ్గర ఉంది. ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర మంత్రులు కమిషన్ తీసుకుంటున్నారు.
పంటలను కాపాడుకోవడానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు మనకు దక్కాల్సిన కృష్ణా జలాలు దక్కాలి. దీనికోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుంది. మంత్రులు కృష్ణా జలాలపై సోయి లేకుండా సొల్లు పురాణం చెబుతున్నారు. కాళేశ్వరాన్ని ఎండబెట్టారు కాబట్టే గతంలో మాదిరిగా సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు నీళ్లు రావడం లేదు. కేసీఆర్ను తిట్టడం బంద్ చేసి కృష్ణా జలాల వాటాను సాధించు కోవడం మీద మంత్రులు ద్రుష్టి పెట్టాలి. మా హయాంలో పదిహేడు పంట సీజన్లకు నీళ్లిచ్చాం. కేసీఆర్ హయంలో ఏపీకి నీళ్లు అక్రమంగా తరలిస్తే ఇన్ని పంటలు పండటం సాధ్యమా?
. రాష్ట్రంలో పెరిగిన పంట విస్తీర్ణం, పంట ఉత్పత్తికి సాగునీళ్ల సక్రమ వాడకమే కారణం. సర్పంచ్కు కూడా సమాధానం చెప్పలేని స్థాయి కాంగ్రెస్ నేతలది. వీళ్లా కేసీఆర్ గురించి మాట్లాడేది. ఇప్పటికైనా సోయి తెచ్చుకుని సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అసలు నీళ్లను ఎట్లా కొలుస్తారో కాంగ్రెస్ నేతలకు తెలుసా.
ఉద్యమం నుంచే టీఎంసీల గురించి తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అవగాహన కల్పించారు. కేసీఆర్ను విమర్శించడానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి సిగ్గుండాలి. కేంద్ర మంత్రులుగా ఉన్న వారికే కేఆర్ఎంబీ అధికారులతో మాట్లాడి తెలంగాణకు రావల్సిన నీళ్లు సాధించడం చేతకాదా’ అని జగదీశ్రెడ్డి ప్రశ్నించారు.
LIVE : BRS Leaders press meet at Telangana Bhavan@jagadishBRS https://t.co/CfaqYzr5nt
— BRS Party (@BRSparty) February 21, 2025