హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : ‘కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ వాదన నిజమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కడిగిన ముత్యం అని మరోసారి నిరూపితమైంది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తేల్చి చెప్పారు. కాళేశ్వరం కట్టించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలు తప్పు అని ఈ తీర్పుతో తేలిందని స్పష్టంచేశారు. ఇకపై కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ ఎవరైనా అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకునే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు.
హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలనే ఘోష్ కమిషన్ తన నివేదిక రూపంలో ఇచ్చిందని దుయ్యబట్టారు. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ఇష్టం లేని కొందరు ఆంధ్రా పెద్దల కుట్ర దాగి ఉన్నదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, బరాజ్లు, ఎన్నో కాలువలు, సొరంగాలు, పంప్హౌస్ల సమాహారమని వివరించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి కుటుంబ సభ్యులు, మంత్రుల కమీషన్ల దందా నడుస్తున్నదని ఆరోపించారు. బనకచర్లకు రూట్ క్లియర్ చేయడం కోసమే గోదావరి నీళ్లను ఆంధ్రాకు వదిలారని మండిపడ్డారు. కేసీఆర్ జగిత్యాల సభకు వస్తే సీఎం రేవంత్రెడ్డి భయపడ్డారని తెలిపారు. సీఎం పోటీ సభలో బూతు పురాణం నడిచిందని మండిపడ్డారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని జగదీశ్రెడ్డి చెప్పారు. తూర్పు తెలంగాణలో నడి ఎండాకాలంలో నీటి అవసరాలు గుర్తించారని తెలిపారు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో నీటి అవసరాలను రేవంత్రెడ్డి ఆలస్యంగానైనా గుర్తించారని చెప్పారు. కాళేశ్వరం నిర్మించడంలో కేసీఆర్ కచ్చితంగా ఇంజినీరేనని, ఆయన రాత్రింబవళ్లూ దాని గురించే ఆలోచించి మూడేండ్లలోనే నిర్మించారని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన చెత్తమాటలు మాని, ప్రజా అవసరాల మేరకు కాళేశ్వరం పంపులను ఆన్ చేయాలని జగదీశ్రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ను బద్నామ్ చేయాలన్న రేవంత్రెడ్డి నిర్వాకం హైకోర్టు తీర్పుతో బట్టబయలైందని, అందుకే రాష్ట్ర ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్రెడ్డి వేర్వేరు కాదని విమర్శించారు. రేవంత్ ఇచ్చిన స్క్రిప్టునే బండి చదువుతారని దుయ్యబట్టారు. సమావేశంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్, భాస్కర్రావు, బీఆర్ఎస్ నేతలు ఒంటెద్దు నరసింహారెడ్డి, చింతల వెంకటేశ్వరరెడ్డి, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు, ధర్మేందర్రెడ్డి పాల్గొన్నారు.