Jagadish Reddy | నల్లగొండ : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )పై అనర్హత వేటు మోదీ( Modi ) నియంతృత్వానికి పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీష్ రెడ్డి( Jagadish Reddy ) అభివర్ణించారు. దీంతో మోడీ అసలు స్వరూపం బట్టబయలు అయ్యిందని ఆయన విరుచుకుపడ్డారు.
శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా( Nallagonda Dist ) కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి చీకటి రోజులు అలుముకున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్షాల అణిచివేత కేంద్రం ఎంచుకున్న మార్గంగా కనిపిస్తుందని ఆయన దుయ్యబట్టారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ ప్రభుత్వం( BJP Govt ) చేస్తున్న తంతు ఇదేనంటూ ఆయన ధ్వజమెత్తారు. విపక్షాల అణిచివేతకే మోదీ సర్కార్ ఈడీ, ఐటీ, సీబీఐలను దుర్వినియోగం చేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ దుర్మార్గాలకు కాలం చెల్లిందని ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.