హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలతో కొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టలేకపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఎద్దేవాచేశారు. శ్వేతపత్రాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బొక్కబోర్లా పడిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో విద్యుత్తు రంగంలో తెలంగాణ అద్భుత విజయాలు సాధించిందని చెప్పారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చామని, ఈ విషయం రైతులకు, ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. విద్యుత్తు సంస్థలకు రూ.50 వేల కోట్ల చేయూత అందించామని తెలిపారు.
అసెంబ్లీలో మంత్రుల మధ్య సమన్వయం లేదని, ప్రతి అంశానికీ తెల్లముఖాలు వేశారని చెప్పారు. వాస్తవాలు చెబితే బెదిరిస్తున్నారని, వారి హయాంలో బోర్ల కోసం, నీళ్ల కోసం, పుస్తెలు.. భూములు అమ్ముకున్న రోజులను రైతులు ఇంకా మర్చిపోలేదని అన్నారు. తెలంగాణ మినహా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఆరు గంటలకు మించి కరెంటు ఇవ్వలేదని తెలిపారు. జెన్కో ప్రాజెక్టులను ప్రభుత్వ సంస్థలకే అప్పగించామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తప్పుల తడకగా శ్వేతపత్రం: ఎమ్మెల్యే పల్లా
కాంగ్రెస్ రూపొందించిన శ్వేత పత్రాలు తప్పుల తడకగా ఉన్నాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. ప్రతిరోజూ అధికారులు ఇచ్చే నివేదికల్లోనే చాలా తప్పులు ఉన్నాయని చెప్పారు. మొదట 82 వేల కోట్ల అప్పు అని చెప్పి.. ఆ తర్వాత 78 వేల కోట్లు చూపించారని.. దీంతో వ్యత్యాసం 4,339 కోట్లు ఉందని చెప్పా రు. శ్వేతపత్రాల్లో తప్పుడు గణాంకాలు ఉన్నాయని మండిపడ్డారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పుల్లో తేడాలు గుర్తించి, ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పాలక పక్షం మొండిగా ప్రవర్తిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థసత్యాలతో బీఆర్ఎస్ను బద్నాం చేయాలని కాంగ్రెస్ చూస్తున్నదని విమర్శించారు. ఆయన వెంట మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు విజేయుడు, కృష్ణమోహన్రెడ్డి, మాణిక్రావు ఉన్నారు.