Jagadish Reddy | నల్లగొండ : సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిన్న తనపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రోతగా ఉన్నాయన్నారు. ఆయన పేరు రేవంత్ రెడ్డి కాదు రోతంత రెడ్డి అని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
సీఎం హోదాలో రేవంత్ మాట్లాడిన తీరు బాధాకరమన్నారు. రేవంత్ మాటల్లో ఓటమి భయం స్పష్టంగా కనబడిందని తెలిపారు. బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్కు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని పేర్కొన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి పదవికి వాళ్ళ నేతలే ఎసరు పెడతారని తెలిపారు. కాంగ్రెస్ 160 రోజుల పాలనలో కరువు వచ్చింది, లక్షల ఎకరాల పంటలు ఎండిపోయాయి. మహిళలు బిందె పట్టుకుని మళ్ళీ రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు.
తెలంగాణ నుంచి రేవంత్ మోదీకి డబ్బు మూటలు పంపిస్తున్నాడని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. మోదీ తన సీఎం పీఠాన్ని కాపాడుతాడని రేవంత్ కలలు కంటున్నాడు. కోమటిరెడ్డి బ్రదర్స్ను రేవంత్ పొగుడుతుంటే ప్రజలే కాదు కాంగ్రెస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారు. అద్దంకి దయాకర్, కొండేటి మల్లయ్య లాంటి వాళ్ళను దూరం పెట్టి.. బూతులు తిట్టిన కోమటిరెడ్డి బ్రదర్స్ను వెనకేసుకు రావడంలో ఆంతర్యమేంటి? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.