సూర్యాపేట : జూన్ 2న సోనియా గాంధీని(Sonia Gandhi) ఏ హోదాలో రాష్ట్రానికి పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రం మళ్లీ పరాయి పాలనలోకి(Colonial rule) వెళ్లిందని సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish Reddy )ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో సగం పాలన ఢిల్లీ నుంచి చేయాల్సి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో ఏ పని చేయాలన్న ఢిల్లీలో అనుమతి తీసుకుని చేయాలి. రాష్ట్ర హక్కులు, నదీ జలాలను హరిస్తున్నారని విమర్శించారు. పదేళ్లుగా ఎంతో బాగా పాలన చేశాం. 2014 జూన్ రెండు నుంచి 2023 డిసెంబర్ వరకు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ వాళ్లు పరిపాలించుకున్నారు. మళ్లీ దురదృష్టవశాత్తు పరాయి పాలన వచ్చి ఢిల్లీపై ఆధార పడాల్సిన దురదృష్టం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
కరెంట్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సెల్ఫోన్ లైట్లతో హాస్పిటల్స్లో ఆపరేషన్లు చేస్తున్న విషయాలు పత్రికల్లో వచ్చాయంటే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. దాడులు చేసి అక్రమ కేసులు పెట్టినా తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ వైపే చూస్తున్నారని తెలిపారు.