హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఉన్న చిన్న పట్టణం జడ్చర్ల.. రవాణా సౌకర్యం ఉన్నా కనీస వసతులు ఘోరం. ప్రతీ పనికి జిల్లాకేంద్రం మహబూబ్నగర్ రావాల్సిన దైన్యం. కరువు విలయతాండవం. వలసలు నిత్యకృత్యం. చెరువులు ఉన్నా నీళ్లు లేని కరువుకాటకం.. నాటి ఉమ్మడి పాలకులు పట్టించుకోకపోవడంతో ఇలా అన్నిచోట్లా జడ్చర్ల మున్సిపాలిటీ వెనుకబాటుకు గురైంది. స్వరాష్ట్రంలో పదేండ్ల కేసీఆర్ పాలనలో జడ్చర్ల పరిస్థితి పూర్తిగా మారింది.
మిషన్ భగీరథతో చెరువులు బాగుపడ్డాయి. దుందుభి వాగుపై చెక్డ్యాంలతో వేసవిలోనూ నీళ్లు దుంకుతున్నాయి. ఉద్దండాపూర్ రిజర్వాయర్తో భూములన్నీ పచ్చని మాగాణాలు కాబోతున్నాయి. దవాఖానలు, కార్యాలయాలు, డబుల్బెడ్రూమ్ ఇండ్లు ఇలా సకల వసతులతో జడ్చర్ల రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. కరువు ఛాయలు కనిపించకుండాపోయాయి. నాటి జడ్చర్లకు నేటి జడ్చర్లకు పోలికే లేదు. అంతలా అభివృద్ధి చెందింది జడ్చర్ల.
జడ్చర్ల, మార్చి 17: పదేండ్ల కేసీఆర్ పాలనలో జడ్చర్ల మున్సిపాలిటీ అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించింది. నాడు కరువుకు నెలవైన ఈ ప్రాంతం.. నేడు బంగారు పంటల మాగాణం అయింది. వేసవిలోనూ చెరువులు అలుగు దుంకుతున్నాయి. జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామా లు పురోభివృద్ధిలో పయణిస్తున్నాయి. జడ్చర్ల మండలంలో పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉద్దండాపూర్ సమీపంలో 16 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణంలో ఉన్నది. రూ.6,500 కోట్లతో చేపట్టిన పనుల్లో భాగంగా 17 కిలోమీటర్ల పొడవునా బండ్ నిర్మాణం కొనసాగుతున్నది. పనులు పూర్తయితే 1.50 లక్షల ఎకరాలు సాగులోకి రా నున్నాయి. రూ.100 కోట్లతో మిషన్ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరించారు. కట్టలను పటిష్టం చేయడంతో నీటినిల్వ సామర్థ్యం పెరిగింది. మిడ్జిల్ మండలానికి ఎంజీకేఎల్ కాలువలతో సాగునీటిని అందిస్తుండటంతో పంటలసాగు పెరిగింది. నియోజకవర్గంలోని దుందుభి వాగుపై రూ.30 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించారు. నల్ల చెరువును రూ4 కోట్లతో, నల్లకుంటను రూ.2 కోట్లతో మినీ ట్యాంక్బండ్లుగా మార్చారు. పుష్కరఘాట్లు, వినాయక ఘా ట్, బోటింగ్, పార్కులు ఏర్పాటు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దాదాపు రూ.300కోట్లకుపైగా నిధులతో జడ్చర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేశారు. రూ.2 కోట్లతో అంబేద్కర్ కళాభవన్, రూ.2 కోట్లతో తాసీల్దార్ కార్యాలయం, భూసార పరీక్ష కేంద్ర భవనం, గిరిజన బాలికలకు గిరిజన వసతి గృహం భవనాలు నిర్మించారు. నియోజకవర్గంలో రూ.250-300 కోట్లతో గ్రామాలకు బీటీ, సీసీరోడ్లు వేశారు. దాదాపు రూ.6.40 కోట్లతో 32 రైతు వేదికలను నిర్మించారు. రూ.109 కోట్లతో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చారు. జడ్చర్లలో రూ.30 కోట్లతో 100 పడకల దవాఖాన నిర్మించారు. బాలానగర్లో 30 పడకల దవాఖాన నిర్మించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నది. పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో పల్లెలు, పట్టణాలు సుందరంగా తయారయ్యాయి. ప్రతి గ్రామ పంచాయతీల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాయ్యాయి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వికలాంగులకు సీఎన్ఆర్ ఫౌండేషన్ ద్వారా త్రిచక్రవాహనాలను అందజేశారు. నియోజకవర్గంలో రూ.100 కోట్లకుపైగా నిధులతో దాదాపు 2 వేల డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. వాటిని అర్హులైన పేదలకు అందించారు. జడ్చర్లలో మినీస్టేడియాన్ని అభివృద్ధి చేశారు. మార్నింగ్ వాకర్ల కోసం వాకింగ్ ట్రాక్తోపాటు ఇండోర్ క్రీడలకు ఇండోర్ స్టేడియం నిర్మించారు. క్రీడాకారులకు ప్రాక్టీస్కు అనువుగా మారింది.