మహబూబ్నగర్ : గ్రంథాలయాలు విజ్ఞాన భాండగారాలు అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేటలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రంథాలయ భవనంతో పాటు బాదేపల్లిలో రూ. 15 లక్షల వ్యయంతో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, 2తో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు, గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని గ్రంథాలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. భవిష్యత్లో తెలంగాణ తప్పక ధనిక రాష్ట్రం అవుతుందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలందరం కలిసి హైదరాబాద్కు దీటుగా మహబూబ్నగర్ను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్లను కలిపి మహానగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. మన్యంకొండ వద్ద ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత పట్టణాలు, గ్రామాల రూపురేఖలు మారిపోయాయని పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అలాగే గ్రంథాలయాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. తెలంగాణ వచ్చాక అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య, సుదర్శన్ గౌడ్, డిసిఎంఎస్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సారిక,జిల్లా గ్రంథాలయ సెక్రటరీ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.