జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 3 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం అల్వాన్పల్లి కాలనీకి చెందిన ఓ కుటుంబం అమెరికాలోని జాక్సన్ కౌంటీలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. అల్వాన్పల్లి కాలనీకి చెందిన సుశీల్రెడ్డి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలోని అలబామాలో పదేండ్లుగా నివాసం ఉంటున్నారు.
భార్యభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మార్చి 29న సుశీల్రెడ్డి తన కుమారుడి కోసం క్రానియల్ ఫేషియల్ థెరపీ స్టేషన్కు వెళ్లి తిరిగి వస్తుండగా జాక్సన్కౌంటీలో కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సుశీల్రెడ్డితో పాటు అతని భార్య అనూష, ఇద్దరు కొడుకులు అద్వైత్రెడ్డి, శ్రేయస్ వివాన్ (ఏడాది) తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ దవాఖానకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి శ్రేయస్ వివాన్ మృతి చెందాడు. సుశీల్రెడ్డి, మరో కొడుకు అద్వైత్రెడ్డి కోమలోకి వెళ్లగా.. అనూష కాళ్లకు సర్జరీ అయ్యింది.
పుట్టినరోజున దైవ దర్శనానికి వెళ్తూ..
ఒరేగాన్ రాష్ట్రంలోని పోర్టులాండ్ నగరంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కృష్ణా జిల్లా కోనకంచికి చెందిన కమతం గీతాంజలి అనే మహిళ, ఐదేండ్ల కుమార్తె హనిక మరణించారు. గీతాంజలి తన పుట్టినరోజు సందర్భంగా ఓ ఆలయానికి దైవ దర్శనానికి కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరో ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన విద్యార్థి ఆచంట రేవంత్ (22) మృతి చెందాడు.