శేరిలింగంపల్లి, మే 3 : ప్రభుత్వ ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యోగ జేఏసీ కృషి చేస్తున్నదని, ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడినట్టు టీఎన్జీవో రాష్ట్ర సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు. ఆదివారం గోపన్పల్లిలోని బీటీఎన్జీవో కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ మాజీ అధ్యక్షుడు, దివంగత బంగారు స్వామినాథం విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భాగ్యనగర్ టీఎన్జీవోస్(గచ్చిబౌలి) మ్యుచువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని హామీ ఇచ్చినట్టు చెప్పారు.
గోపన్పల్లిలోని బీటీఎన్జీవోల స్థలవివాదానికి సంబంధించిన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే పరిష్కారం కానున్నట్టు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాస్రావు, భాగ్యనగర్ టీఎన్జీవో అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్, టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేని, కస్తూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.