హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): దేశంలో ఇతర పార్టీల నుంచి చేరికలు ప్రారంభించిందే కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయిస్తే ఆటోమెటిక్గా వేటుపడేలా చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో చేర్చిన నేపథ్యంలో శనివారం ఎక్స్ వేదిగా కేటీఆర్ స్పందించారు. దేశంలో ఇతర పార్టీల నేతల చేరికలను ప్రారంభించిందే కాంగ్రెస్ అని, ఆ పార్టీ ప్రారంభించిన ఆయా రామ్- గయా రామ్ సంసృతిపై ఇప్పటికైనా మార్చుకోవడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. ఆ హామీ స్వాగతించదగ్గదేనని, కానీ ఆ పార్టీ చెప్పేదొకటి, చేసేదొకటిగా ఉంటుందని విమర్శించారు.
ఇతర పార్టీల నుంచి చేర్చుకోబోమంటూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఇచ్చిందని మండిపడ్డారు. మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ను రాజీనామా చేయించకుండానే తన పా ర్టీలో కలుపుకున్నదని ధ్వజమెత్తారు. రాహుల్కు నిబద్ధత ఉంటే ఈ అంశంపై మాట్లాడాలని, లేకుంటే ఆయన ఒక హిపోక్రాట్గా మిగిలిపోతారని అన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడమో, స్పీకర్తో అనర్హత వేటు వేయించడమో చేయాలని రాహుల్కు సవాల్ విసిరారు.