గోదావరి నదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున చాలా ఊళ్లుంటాయి. సాధారణంగా ఈ ఊళ్ల ప్రజల మధ్య మంచి సంబంధాలే ఉంటాయి. నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపెల్లి- నిర్మల్ జిల్లా చిన్నబెల్లాల గ్రామాలూ అలాంటివే. నది ఎక్కువగా పారనప్పుడు గోదావరిలో నుంచే వీళ్ల ప్రయాణం సాఫీగా సాగేది. ప్రవాహం ఎక్కువయితే రాకపోకలు సాధ్యమయ్యేవి కావు. పక్క ఊరికి వెళ్లాలంటే, 79 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. తమ ఊళ్ల మధ్య వంతెన కట్టమని ప్రజలు దశాబ్దాలుగా పోరాటం చేసినా ఫలితం శూన్యమే అయ్యింది.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలోనే బోర్నపెల్లి-చిన్నబెల్లాల మధ్య గోదావరి నదిపై వంతెనను నిర్మించాలని సంకల్పించారు. డబుల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరు చేశారు. 2015 మార్చిలో ప్రారంభమైన వంతెన పనులు మూడేండ్లలో పూర్తయ్యాయి. కిలోమీటర్ పొడవుండే ఈ వంతెన జగిత్యాల, నిర్మల్ జిల్లాల మధ్య దూరాన్ని ఏకంగా 79 కిలోమీటర్లు తగ్గించింది. దీంతో రెండు జిల్లాలూ వంతెన సాక్షిగా ఒక్కటయ్యాయి. రెండు ప్రాంతాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.