జలదృశ్యంలో మేం కార్యాలయాన్ని పెట్టుకుంటే సమైక్య పాలకులు ఖాళీ చేయించి, ఫర్నిచర్ను బయటపడేసి అవమానించిన ప్రదేశంలోనే.. నేడు త్యాగమూర్తులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించాం. ఇది కేసీఆర్ దృఢ సంకల్పానికి నిదర్శనం. ప్రతి తెలంగాణ వ్యక్తి గర్వపడే సందర్భం.
– మంత్రి ప్రశాంత్రెడ్డి
హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన అమరవీరులకు గుర్తుగా రాష్ట్రప్రభుత్వం హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన అమరుల స్మారకం ప్రారంభానికి సిద్ధమైంది. ఢిల్లీలోని గాంధీ స్మారకంలా దీన్ని తీర్చిదిద్దారు. దేశానికి విదేశీ ప్రతినిధులు ఎవరు వచ్చినా మహాత్మాగాంధీకి ముందుగా నివాళులర్పించినట్టు.. రాష్ర్టానికి వచ్చే దేశ,విదేశ ప్రతినిధులెవరైనా ముందుగా అమరుల స్మారకం వద్ద నివాళులర్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 180 కోట్లతో నిర్మించిన ఈ కట్టడాన్ని ఈ నెల 22న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా స్మారకం నిర్మాణంలో మొదటినుంచీ అన్నీ తానై వ్యవహరిస్తూ అద్భుతంగా తీర్చిదిద్దటంలో ప్రముఖపాత్ర పోషించిన రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చారు. వివరాలు…
అమరజ్యోతి ఏర్పాటు వెనుక ఉద్దేశం?
స్వరాష్ట్ర సాధనలో అమరులైన వారి త్యాగాల స్ఫూర్తి నిరంతరం తెలంగాణ సమాజం మదిలో ఉండాలనే ఉద్దేశంతో స్మారక చిహ్నంలో నిరంతరం వెలిగే అమరజ్యోతిని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ జ్యోతిని దీపం ఆకారంలో నిర్మించాలని నిశ్చయించారు. అంతేకాదు, సచివాలయంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులు ఎల్లప్పుడూ అమరవీరులను తలుచుకుంటూ వారి త్యాగాల ఫలితంగానే నేడు తాము ఇక్కడ సేవలు అందిస్తున్నామనే భావన కలిగి ఉండాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన.
స్మారకం నిర్మాణం ఇక్కడే చేయటం
వెనుక ఏమైనా ప్రత్యేక కారణం ఉన్నదా?
తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో ఇక్కడ జలదృశ్యం పేరుతో భవనం ఉండేది. అక్కడే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నేతృత్వంలో పురుడుపోసుకున్నది. ఆనాడు సమైక్యపాలకులు మేం ఏర్పాటు చేసుకున్న కార్యాలయాన్ని ఖాళీ చేయించి, అత్యంత అవమానకరంగా ఫర్నిచర్ను బయట పడేసిన ప్రదేశంలోనే నేడు త్యాగమూర్తులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించాం. ఇది ప్రతి తెలంగాణ వ్యక్తి గర్వపడే సందర్భం. ఎక్కడైతే మొదటి అవమానం ఎదురైందో అక్కడే ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద స్మారకాన్ని నిర్మించటం సీఎం కేసీఆర్ దృఢ సంకల్పానికి నిదర్శనం. ఇది కేవలం ఒక స్మారక స్థూపంగా, ఏడాది కోసారి నివాళులర్పించే ప్రాంతంగా ఉండదు. ఇందులో తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఛాయాచిత్ర ప్రదర్శన, ఫొటో గ్యాలరీలో ఉంటుంది. థియేటర్లో ఉద్యమ ప్రస్థానం, రాష్ట్ర సాధనలోని ప్రధాన ఘట్టాలు, రాజకీయ ప్రక్రియ, రాష్ట్ర ఏర్పాటు తరువాత సాధించిన ప్రగతి తదితర అంశాలతో కూడిన 20 నిమిషాల నిడివితో ప్రదర్శన ఉంటుంది. కాన్ఫరెన్స్హాలు, గ్యాలరీ, రెస్టారెంట్ తదితరవాటిని సందర్శించేవారు తప్పనిసరిగా అమరుల త్యాగాలను స్మరించుకుంటారు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్లెస్స్టీ ల్ స్మారకం అంటున్నారు.. దీని విశేషాలు ఏమిటి?
జర్మనీనుంచి ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీల్ను తెప్పించాం. దీన్ని దుబాయ్కి చెందిన కంపెనీ మౌల్డింగ్ చేసింది. భవనానికి చుట్టూ ఏర్పాటుచేసిన స్టెయిన్లెస్ స్టీల్కు సుమారు 4000-5000 మౌల్డింగ్లు ఉండడం విశేషం. దీనికి 100 టన్నులకుపైగా స్టెయిన్లెస్ స్టీల్ను ఉపయోగించాం. ఇంత భారీస్థాయిలో స్టెయిన్లెస్ స్టీల్ కట్టడం ప్రపంచంలో మరెక్కడా లేదు. చికాగో, దుబాయ్లో ఈ తరహా కట్టడాలు ఉన్నప్పటికీ అవి ఇంత విశాలమైనవి కాకపోగా, అవి స్మారక చిహ్నాలు కావు. అలాగే, అమరజ్యోతి ఎప్పటికీ నిలిచిపోయే విధంగా కార్బన్ స్టీల్తో తయారు చేయించాం. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకొని నిలబడటం, తుప్పు పట్టకపోవటం దీని ప్రత్యేకత.
చుట్టూ స్టీలు వలయం ఉండటంవల్ల గాలి ఆడటం కష్టం కదా.. వేడిని తట్టుకోవటం ఎలా?
అమరులకు గౌరవ సూచికంగా కొవ్వొత్తులు, దీపాలు వెలిగించటం ప్రపంచవ్యాప్తంగా ఆనవాయితీగా వస్తున్నది. ఈ క్రమంలోనే వెలుగుతున్న దీపం ఆకృతిగల నిర్మాణాన్ని సీఎం ఎంపికచేశారు. అయితే చుట్టూ స్టీలు వలయం ఉన్నప్పటికీ భవనం వేడెక్కకపోవటమే ఈ డిజైన్ ప్రత్యేకత. నాలుగు మిల్లీమీటర్ల స్లెయిన్లెస్ స్టీల్తో మెరిసే బాహ్యభాగం వేడిని ప్రతిబింబిస్తుంది. అలాగే పఫ్ మెటీరియల్, సపోర్టింగ్ జీఆర్సీ(ఫైబర్-రీయిన్ఫోర్స్ కాంక్రీట్) షీట్లు లోపల ఉష్ణోగ్రతను నియంత్రించటంలో సహాయపడతాయి. ఇది పూర్తిస్థాయి ఎయిర్కండీషన్డ్ భవనం.
రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ స్మారకం నిర్మాణంలో భాగస్వాములైనందుకు ఎలా ఉంది?
తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ మహత్కార్యంలో నేను భాగస్వామిని కావటం ఎంతో తృప్తినిచ్చింది. స్మారకం నిర్మాణాన్ని ఒక పనిగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా, ఒక ఆత్మగౌరవంగా భావించి పనిచేశాం. నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇందులో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు అంతా ఎంతో పట్టుదలతో పనిచేశారు. డిజైన్ ఎంపిక నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి అంశంలోనూ సీఎం కేసీఆర్ సూచనలు పాటిస్తూ, ఆయన మార్గదర్శనంలో నిర్మాణం పూర్తిచేశాం.
స్మారకం నిర్మాణంలో అవినీతి జరిగిందనే ఆరోపణలపై మీ కామెంట్?
ఇది రాష్ట్ర సాధనకోసం అసువులుబాసిన త్యాగధనులను స్మరించుకునే ఒక గుడి వంటిది. ఇందులో భాగస్వాములైనవారంతా ఎంతో నిష్టతో పనిచేశారు. పూర్తి పారదర్శకత పాటించాం. నిర్మాణ వ్యయం తగ్గించేందుకు ఉన్న అన్ని మార్గాలనూ అనుసరించాం. ఈ పవిత్రమైన కార్యంలో ఏ మాత్రం అవినీతికి తావులేదు. ఊహాజనిత ఆరోపణలకు మేము చేసేదేమీ లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లయ్యింది. ఎక్కువకాలం పరిపాలన చేసింది కాంగ్రెస్పార్టీయే. అయినా దేశ స్వాతంత్రోద్యమంలో అసువులుబాసిన వీరుల కోసం ఎందుకు స్మారకాన్ని నిర్మించలేకపోయారు. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదు. అంటే దేశం కోసం త్యాగాలు చేసినవారిని వాళ్లు మర్చిపోయినట్టు అందరూ మర్చిపోతారనుకుంటే ఎలా?
రాష్ట్రంలో మరో పర్యాటక ప్రాంతంగా అమరుల స్మారకం ఉండనుందా?
అందులో సందేహం లేదు. హుస్సేన్సాగర్ తీరంలో నిర్మించిన 125 అడుగుల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం దేశవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుండగా, దేశంలో ఎక్కడా లేని అరుదైనరీతిలో స్టెయిన్లెస్ స్టీల్తో నిర్మించిన అమరుల స్మారకం మరో పర్యాటక కేంద్రంగా మారనున్నది. ఓ వైపు అత్యం త ఆకర్షణీయ సచివాలయం, మరోవైపు, ఆహ్లాదకర హుస్సేన్సాగర్ పరిసరాలు, బుద్ధుని విగ్రహం, లుంబినీ పార్క్, ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్ తదితర ప్రాంతాలకుతోడు ఇప్పుడు తాజాగా అమరుల స్మారక చిహ్నం హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తెస్తుంది. అంతేకాదు, రాష్ట్ర ఏర్పాటుకు జరిగిన పోరాటాన్ని ఇది ఎప్పటికీ గుర్తుకు తెస్తూనే ఉంటుంది.
రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ స్మారకం నిర్మాణంలో భాగస్వాములైనందుకు ఎలా ఉంది?
తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ మహత్కార్యంలో నేను భాగస్వామిని కావటం ఎంతో తృప్తినిచ్చింది. స్మారకం నిర్మాణాన్ని ఒక పనిగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా, ఒక ఆత్మగౌరవంగా భావించి పనిచేశాం. నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించిన సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇందులో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు అంతా ఎంతో పట్టుదలతో పనిచేశారు. డిజైన్ ఎంపిక నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రతి అంశంలోనూ సీఎం కేసీఆర్ సూచనలు పాటిస్తూ, ఆయన మార్గదర్శనంలో నిర్మాణం పూర్తిచేశాం.
అమరుల స్మారకానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి?
దేశానికి విదేశీ ప్రతినిధులు ఎవరు వచ్చినా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించటం ఆనవాయితీ. అలాగే, ఇకనుంచి తెలంగాణకు దేశవిదేశాల నుంచి ఎవరు వచ్చినా ముందు అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇలా రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన వీరులను ఎప్పటికీ మర్చిపోకుండా స్మరించుకుంటూ ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ఎప్పుడూ సందర్శకులతో కళకళలాడే విధంగా అన్ని ఏర్పాట్లూ ఇందులో ఉన్నాయి. కాన్ఫరెన్స్హాలు, ఆడిటోరియం, సువిశాలమైన రెస్టారెంట్, దాదాపు 400 కార్లు సరిపోయే పార్కింగ్ నిర్మించాం. ఆడిటోరియం, కాన్ఫరెన్స్హాలులో సెమినార్లు, వివిధ బిజినెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవచ్చు. రెస్టారెంట్లో అన్నిరకాల ఆహార పదార్ధాలు అందుబాటులో ఉంటాయి. వీటిపై వచ్చే ఆదాయం స్మారకం నిర్వహణ ఖర్చులకు సరిపోతుంది.