MLA Raja Singh | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు బీజేపీ అధిష్ఠానం చెక్ పెట్టేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తున్నది. బీఆర్ఎస్ నేత ఆల పురుషోత్తంను పార్టీలో చేర్చుకోవడం ఇందుకు బలం చేకూర్చుతున్నది. పురుషోత్తంను చేర్చుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశం రాజాసింగ్ను పక్కన పెట్టడమే అని చర్చ జరుగుతున్నది. బీజేఎల్పీ నేత పదవి ఇవ్వకపోవడంతో రాజాసింగ్ అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ పెద్దగా పాల్గొనలేదు. రాష్ట్ర నాయకత్వం నిర్వహిస్తున్న అంతర్గత సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యనేతలు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా ‘మూసీ నిద్ర’ కార్యక్రమాన్ని కూడా రాజాసింగ్ లైట్ తీసుకున్నారు. దీంతో పార్టీ పెద్దలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హైదరాబాద్లో గెలిచిన ఏకైక బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి, మూసీ నిద్ర కార్యక్రమానికి డుమ్మా కొట్టడం ఏంటని పార్టీ పెద్దలు రాజాసింగ్పై మండిపడ్డట్టు చర్చ జరుగుతున్నది. గోషామహల్ నియోజకవర్గంలోని చంద్రకిరణ్ బస్తీ, ఉప్పలమ్మ బస్తీ, చుడీ బజార్, శంకర్నగర్ సహా పలు కాలనీలు మూసీ పరీవాహకంలో ఉన్నాయి. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని కొన్ని ఇండ్లను అధికారులు ఖాళీ చేయించారు. కానీ రాజాసింగ్ స్పందించకపోవడం, మూసీ నిద్రను పట్టించుకోకపోవడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.