ఖమ్మం/హైదరాబాద్: మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. ఖమ్మంలోని ఆయన నివాసంతోపాటు హైదరాబాద్లోని ఇండ్లు, ఆఫీసుల్లో గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన అనుచరుల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకుని తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్లోని నందగిరిహిల్స్ వంశీరామ్ జ్యోతి హిల్రిడ్జ్తోపాటు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని రాఘవా ప్రైడ్లో కూడా ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీస్తున్న పొంగులేటి శ్రివాస్ రెడ్డి.. నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసుకున్నారు. ఈ తరుణంలో ఆయన నివాసంతోపాటు కార్యాలయాలపై దాడులు జరగడం విశేషం. బుధవారం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరావు ఇంటిపై కూడా ఐటీ దాడులు జరిగాయి.