Komuravelli Mallanna | హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): హిందూ ధర్మానికి తామే పరిరక్షకులమని, దేవుళ్లను కొలవడంలో.. గుళ్లు, ఆలయాలను కాపాడటంలో తమను మించిన భక్తులు లేనే లేరని చెప్పుకొనే బీజేపీ అసలు నైజం బట్టబయలైంది. తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాల ఆస్తులను కబ్జా చేస్తున్నదని, మైనార్టీల ప్రార్థనా మందిరాల ఆస్తుల జోలికి వెళ్లడం లేదని ప్రధాని మోదీ మంగళవారం నిజామాబాద్లో ఆరోపణలు గుప్పించారు.
ఈ మాటలు విన్న వారెవరైనా ప్రధాని మోదీకి, కమలనాథులకు హిందూ దేవాలయాలపై ఎంత ప్రేమో అనుకుంటారు. కానీ ప్రధాని వెళ్లిన మరుసటి రోజే తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది. కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి రూ.8 కోట్ల ఇన్కం ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు వచ్చాయని ఆలయ అధికారులు వెల్లడించారు. సకాలంలో పన్ను కట్టనందున మరో రూ.3 కోట్ల జరిమానా కూడా కట్టాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారని తెలిపారు. కొమురవెల్లి మల్లన్నకే కాకుండా, బాసరలోని సరస్వతి ఆలయం, వేములవాడ రాజన్న సహా ఇంకా పలు దేవాలయాలకు ఇప్పటికే ఐటీ నోటీసులు వచ్చినట్టు చెప్తున్నారు.
దీంతో ప్రధాని మోదీది, బీజేపీ నేతలందరిది ఆలయాలపై ప్రేమ అంతా నటనేనని.. కపట ప్రేమ అని నిరూపితమైంది. గుళ్లు, దేవాలయాలు, హిందుత్వం అంటూ మతం గురించి మాట్లాడే బీజేపీ ఒకవైపు ప్రేమ ఒలకబోస్తూనే మరో వైపు ఇలా నోటీసులు ఇవ్వడం కేంద్రంలోని ఒక్క బీజేపీ సర్కారుకే చెల్లింది. బీజేపీ తన చేతిలోని ఐటీ శాఖను ప్రత్యర్ధి పార్టీలపై ఎక్కుపెట్టడానికే కాదు.. గుళ్లకు చెందిన ఆస్తులపై గురిపెట్టేందుకు కూడా ఉపయోగిస్తుందన్నది పచ్చినిజమని మరోసారి తేటతెల్లమయ్యింది. వేల కోట్ల రూపాయలు దోచుకొని.. పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులను వదిలిపెట్టి ఆధ్యాత్మిక కేంద్రమైన మల్లన్న గుడికి పన్ను కట్టాలని నోటీసులు ఇవ్వడం మోదీ సర్కారుకే చెల్లిందని భక్తులు మండిపడుతున్నారు.
మల్లన్న గుడి 12 కోట్లు కట్టాలట…
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి ఐటీ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం 2016-17 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయంపై పన్ను కట్టాలని ఆదేశించారు. ఐటీ చట్టం 147 కింద రూ.8,64,49,041 పన్ను చెల్లించాల్సి ఉన్నదని, దీన్ని సకాలంలో చెల్లించనందుకు ఐటీ చట్టంలోని సెక్షన్ 271 (1) సీ ప్రకారం రూ.3,49,71,341, ఐటీ చట్టంలోని సెక్షన్ 271(1) డీ ప్రకారం మరో రూ.20వేలు, ఐటీ చట్టం 271 (ఎఫ్) కింద మరో రూ.5 వేలు జరిమానాలుగా చెల్లించాలని, మొత్తంగా రూ.12 కోట్లకుపైగా సొమ్మును తక్షణం చెల్లించాలని హైదరాబాద్ సర్కిల్ ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది.
పన్ను.. ఆపై జరిమానా
భక్తులు సమర్పించే కానుకలతో వెళ్లదీసే గుడికి రూ.8.64 కోట్ల పన్ను చెల్లించాలనడమే విడ్డూరమైతే.. ఆ పన్ను చెల్లించలేదంటూ మరో మూడున్నరకోట్లు జరిమానా విధించడం దారుణం. కోట్లకు కోట్లు పన్నులు ఎగ్గొట్టే వారిని వదిలిపెట్టే మోదీ సర్కారు.. దేవాలయంపై మాత్రం మూడున్నర కోట్ల జరిమానా కూడా విధించడం విస్తుగొలుపుతున్నదని భక్తులు వాపోతున్నారు. ఆదాయం వచ్చే ప్రతీ ఒక్కరు పన్నులు చెల్లించాల్సిందే. ఐటీ రిటర్నులు సమర్పించకపోతే ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడం సాధారణయే. అయితే, ఆధ్యాత్మిక సంస్థల విషయంలో ఐటీ శాఖ వారికి మార్గదర్శనం చేయాలి. ఆధ్యాత్మిక సంస్థలు తమకు వచ్చే ఆదాయాన్ని లాభాపేక్ష లేకుండా ఖర్చు చేస్తాయి. లెక్కల విషయంలో ఏదైనా తేడాలుంటే ఐటీ శాఖ సరిచేయాలి. ఇలాంటి ధార్మిక సంస్థలపై జరిమానాలు విధంచడంలో ఆచితూచి ఆలోచించాలి. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు కఠిన వైఖరిని అవలంబించరాదు.