రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): వస్త్ర నగరి, సేద్య ఖిల్లాగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల సిగలోకి ఇప్పుడు మెగా ఫుడ్ప్రాసెసింగ్ పార్క్ చేరబోతున్నది. ఇప్పటికే టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమలు ప్రారంభం కాగా.. కొత్తగా రైతులు, నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా భారీ పుడ్ప్రాసెసింగ్ ఇండస్ట్రీయల్ పార్క్ రూపుదిద్దుకుంటున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో గంభీరావుపేట మండలం నర్మాలలో ని సిద్దిపేట, కామారెడ్డి ప్రధాన రహదారి పక్కనే 309 ఎకరాల్లో చేపట్టిన ఈ పార్క్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ.11 కోట్ల వ్య యంతో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు టవర్ల పనులు జరుగుతుండగా.. యూనిట్ల స్థాపనకు కంపెనీల రాక మొదలైంది. న్యూడుల్స్, న్యూట్రిషన్ వంటి ఫుడ్ ఐటమ్స్ తయారీకి ముందుకొచ్చిన అగస్త్య సూపర్ఫుడ్ ఇండియా ప్రైవేట్ లి మిటెడ్ సంస్థకు సంబంధించి షెడ్ల నిర్మాణం తుది దశకు చేరింది. త్వరలోనే ఉత్పత్తులు ప్రా రంభించేందుకు ఆ కంపెనీ సిద్ధమవుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఐపాస్ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నది. అందులో భాగంగానే.. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. పంటల మార్పిడితో రైతులు అధిక లాభాలు ఆర్జిస్తూ కొత్తకొత్త రకాల పంటలను మార్కెట్లోకి తెస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. రకరకాల పంటల ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో.. పుడ్ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై సర్కారు దృష్టి సారించింది. ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణసౌకర్యం కల్పిస్తున్నది.
గంభీరావుపేట మండలంలోని నర్మాలలో 309 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీయల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ) సంస్థ పార్క్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నది. సుమారు రూ.50 కోట్లు వెచ్చించి 100 ఫీట్ల వెడల్పుతో మెయిన్ రోడ్లు, 30 ఫీట్ల వెడల్పుతో అంతర్గత రోడ్లు, విద్యుత్తు, నీటి వసతుల కల్పన వంటి పనులు చేయిస్తున్నారు. మురుగు కాలువలు, జంక్షన్ల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. 309 ఎకరాలలో అతిపెద్ద ఫుడ్ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటుతో ఇక్కడికి పెద్ద ఎత్తున పరిశ్రమలను రప్పించేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే సిరిసిల్ల మెడికల్, నర్సింగ్, జేఎన్టీయూ, వ్యవసాయ, వ్యవసాయ పాలిటెక్నిక్, ఐటీఐ, అంతర్జాతీయ డ్రైవింగ్ శిక్షణ సంస్థల ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చెందింది. వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువుగా టెక్స్టైల్స్పార్క్, అప్పారెల్పార్క్, ఫుడ్ప్రాసెసింగ్ పార్క్ల ఏర్పాటుతో ఇండస్ట్రీయల్ హబ్గా రూపుదిద్దుకోబోతున్నది. అప్పారెల్ పార్కులో గోకుల్దాస్ కంపెనీ లోదుస్తుల తయారీలో 1000 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నది.