హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం. జనహితమే మా అభిమతం అన్న మాటమీద’ ఈ ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఈ కులం, ఆ మతం.. వీళు, వాళ్లు అని సమాజాన్ని వేరుచేసి చూడకుండా పేదరికమే ప్రాతిపదికగా అన్నివర్గాలవారికి సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో జరిగిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎనిమిదేండ్లలో తెలంగాణలో కరెంటు, తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మునుగోడు, దేవరకొండ, ఇబ్రహీంపట్నం వంటి ప్రాంతాల్లో ఉన్న ఫ్లోరోసిస్ను సీఎం కేసీఆర్ రూపుమాపారని గుర్తుచేశారు.
స్వరాష్ట్రంలో కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు, ఖమ్మంలో సీతారామ వంటి అద్భుత ప్రాజెక్టులను కట్టుకున్నామని చెప్పారు. 2014లో రాష్ట్రంలో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే ఈ రోజు 3.5 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసేస్థాయికి తెలంగాణ చేరుకున్నదన్నారు. యాసంగి వడ్లు కొనమని కేంద్రం మెలికపెట్టడమే గాక.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించడం నేర్పించమని హేళన చేశారని గుర్తుచేశారు.
ఇది తెలంగాణ ప్రభుత్వానికి జరిగిన అవమానం కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ అవమానమన్నారు. నూకలు తినుమని అవమానించిన వారి తోకలు కత్తిరిద్దామా! అని పిలుపునిచ్చారు. పచ్చని పంటలు పండాలా.. లేక మతం పేరిట మంటలు మండాలా ఆలోచన చేయండని, చిల్లర మల్లర వేషాలు వేసే రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలిన అవసరం ఉన్నదని చెప్పారు. 2014లో ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముడి చమురు ధర 94 డాలర్లు ఉంటే..
నేడు ఆ ధర ఐదారు డాలర్లు మాత్రమే పెరిగిందని, అదే పెట్రోల్ ధర లీటరుకు రూ.70 నుంచి రూ.112కు పెరిగిందని ఆందోళన వ్యక్తంచేశారు. పెట్రోల్, డీజిల్పై పన్నులను తెలంగాణ ప్రభుత్వం పెంచనప్పటికీ కేంద్రం రాష్ర్టాలపై నెపం మోపుతున్నదని, ముడి చమురు ధర పెరగకున్నా, పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే ఎందుకు పెరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలన్నారు. బండ్లు, లారీలపై ఎక్సైజ్ డ్యూటీ, పెట్రోల్, డీజిల్పై సెస్సు వేసి ఏడేండ్లలో రూ.30 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం దోచుకున్నదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం సెస్ను రద్దు చేసి రూ.70కే పెట్రోల్, రూ.60కే డీజిల్ను ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
జన్ధన్ సొమ్మంతా ఆయన ఖాతాలోకే..
జన్ధన్ ఖాతాల్లో వేస్తామన్న సొమ్మంతా నల్లగొండలో ఒకాయన ఖాతాలోనే పడినట్టుందని రాజగోపాల్రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక్కడు ధనవంతుడు అయితే దేశం మారిపోదని, సంపద పెరగదని.. ఆ ఒక్కడు ధనవంతుడు అయితే నల్లగొండ రూపురేఖలు మారిపోతాయా? అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వానికి సరుకు, విషయమూ లేదని, ఎనిమిదేండ్లలో అన్నివర్గాలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ధ్వజమెత్తారు.
లారీ డ్రైవర్లు, యజమానుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని, ఇంకా ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తెస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సంస్కరణల పేరుతో కేంద్రం రవాణా రంగాన్ని కుదేలు చేసిందని, తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ పర్మిట్తోపాటు యాక్సిడెంట్ కేసుల సందర్భంలో డ్రైవర్ల లైసెన్స్లను రద్దు చేయడం వంటి అనేక సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపినట్టు తెలిపారు.
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా గ్రీన్ ట్యాక్స్ను తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, నన్నపనేని నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బూడిద నందారెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్కే చాంద్పాషా, నాయకులు సురివి యాదయ్యగౌడ్, రామినేనటి శ్రీనివాస్, సుధాకర్గౌడ్, భూపాల్, పూర్ణచందర్, వాసు, మధు, శ్రీనివాస్గౌడ్, అశోక్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.