హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): బడుల ప్రారంభం రోజున విద్యార్థులకు ఇవ్వాల్సిన వెల్కమ్ కిట్ ఈసారి అందేపరిస్థితి కనిపించడం లేదు. గురుకుల, ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు పాఠశాల ప్రారంభం రోజునే పుస్తకాలు, యూనిఫామ్లు తదితర వాటితో వెల్కమ్ కిట్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ స్టేషనరీ కోసం నిర్వహించిన టెండర్లు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ సైతం పూర్తికాలేదు. దీంతో ప్రభుత్వ హామీ అటకెక్కినట్టేనని తెలిసిపోతున్నది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మాడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులకు ప్రతి సంవత్సరం పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు మొత్తంగా 24 రకాల వస్తువులను ప్రభుత్వమే అందిస్తున్నది. ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి ఆయా వస్తువుల కోసం సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలోని పీఎంయూ టెండర్లను ఆహ్వానించింది. ఏజెన్సీలను ఖరారు చేసి, వర్క్ ఆర్డర్లను ఇవ్వాల్సి ఉన్నది. 9 రకాల వస్తువులకు సంబంధించిన టెండర్ల గడువు ముగిసి నెలరోజులు అవుతున్నది. కానీ ఇప్పటికీ ఏజెన్సీలను ఖరారు చేయలేదు. మరోవైపు విద్యాసంస్థలు 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వర్క్ అగ్రిమెంట్లు ఇప్పటికిప్పుడు పూర్తిచేసినా సరఫరాకు 45 రోజుల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పాఠశాల ప్రారంభం నాటికి కిట్లు అందడం కష్టమేనని తెలుస్తున్నది.