హైదరాబాద్లాంటి అంతర్జాతీయస్థాయి నగరంలో ఉంటే ఆ మజానే వేరు. అందులోనూ సర్కారు కొలువైతే ఆ కిక్కే వేరు. గ్రామీణ ప్రాంతాలు, ద్వితీయ శ్రేణి నగరాలతో పోలిస్తే ఇక్కడ దాదాపు రెట్టింపు హెచ్ఆర్ఏ లభిస్తుంది. సరిగ్గా ఇప్పుడిదే అంశం టీచర్ల బదిలీలకు మోకాలడ్డుతోంది. ఇక్కడి నుంచి బదిలీ అయి ఇంకెక్కడో పడితే మహానగరంలోని సకల సౌకర్యాలను కోల్పోవడంతోపాటు హెచ్ఆర్ఏ సహా ఇతర ‘వ్యాపకాల’ను కోల్పోతామన్న భయం వారిని ఎలాగైనా బదిలీలను అడ్డుకోవాలని పురమాయిస్తున్నది. కోర్టులకెక్కి బదిలీలను జాప్యం చేయించేందుకు కారణమవుతున్నది. ‘సొంతలాభం కొంత మానుకుని..’ అన్న గురజాడ పలుకులను భ్రష్టు పట్టిస్తూ సొంత లాభం కోసం పాకులాడుతున్న కొందరు టీచర్లు.. 95శాతం మంది ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుకుంటూ విలన్లుగా మారుతున్నారు.
Teachers Transfers | హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు ఏండ్ల తరబడి ప్రహసనంగా మారడం వెనక కొందరు ఉపాధ్యాయులే ఉన్నారన్న నిజం విస్తుగొలుపుతున్నది. పూటకో అభ్యంతరం.. రోజుకో తిరకాసుతో బదిలీలకు ఆటంకం కలిగిస్తూ నిజంగా ట్రాన్స్ఫర్లు కోరుకునే 95 శాతం మంది తోటి టీచర్లకు అన్యాయం చేస్తున్నారు. సాక్షాత్తూ ఉపాధ్యాయ సంఘాల నేతలే ఈ విషయం చెబుతున్నారు. కేసులతో బదిలీలు అడ్డుకోవడం శోచనీయమని యూటీఎఫ్ నేతలు జంగయ్య, చావ రవి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అనుకున్న చోట పోస్టింగ్ రాదన్న భయంతో బదిలీలను అడ్డుకోవాలని ప్రయత్నించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు టీచర్లు 9 ఏండ్లుగా పదోన్నతలు లేక నిరాశలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులకెళ్లి కేసులు వేసి బదిలీలను ఆపేవారిని ఉపాధ్యాయ లోకం క్షమించదని వారు హెచ్చరించారు.
పదోన్నతలు లేకుండానే పదవీ విరమణ
రాష్ట్రంలో 2015 నుంచి పదోన్నతులు, 2018 నుంచి బదిలీలు లేకపోవడంతో పదోన్నతి పొందకుండానే రిటైరైపోతామేమోనని కొందరు టీచర్లు ఆందోళనలో ఉన్నారు. 70 శాతం స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారానే భర్తీచేయాల్సి ఉండడంతో ఆయా పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. టీచర్ల అవస్థలను అర్థం చేసుకున్న ప్రభుత్వం జనవరిలో బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. మార్గదర్శకాలను విడుదల చేసింది. బదిలీలు కోరుతూ 1,03 లక్షల టీచర్లకు గాను 74,101 మంది టీచర్లు దరఖాస్తులు సమర్పించారు. అయినప్పటికీ కొందరు టీచర్లు ఉద్దేశపూర్వకంగా బదిలీలు, పదోన్నతులు ఆపేందుకు ప్రయత్నించారు. స్పౌజ్ పాయింట్లు చట్ట విరుద్ధమంటూ కోర్టును ఆశ్రయించారు. ఉపాధ్యాయ సంఘాల నేతలకు కేటాయించిన ప్రిఫరెన్షియల్ పాయింట్లపైనా కేసు వేయడంతో బదిలీలపై హైకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి వాదనలు కొనసాగుతుండగా, ఫిబ్రవరిలో జరగాల్సిన బదిలీ ప్రక్రియ సెప్టెంబర్కు చేరింది. ఆగస్టులో స్టేను వెకేట్ చేసిన హైకోర్టు పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. తాజాగా షెడ్యూల్ను విడుదల చేసి దరఖాస్తులు ఆహ్వానించగా 6,500కుపైగా దరఖాస్తులొచ్చాయి.
మళ్లీ కుట్రలు మొదలు
హైకోర్టు తీర్పుతో అంతా ఓకే అనుకున్న సమయంలో మళ్లీ కేసులు మొదలయ్యాయి. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ఆపేందుకు కొందరు టీచర్లు కోర్టును ఆశ్రయిస్తున్నారు. స్పౌజ్ పాయింట్లు చట్టబద్ధమేని హైకోర్టు ప్రకటించడం, స్టేను ఎత్తివేయడంతో బదిలీలు, పదోన్నతులు యథాతథంగా జరుగుతాయని అంతా ఆశించినప్పటికీ మళ్లీ నిరాశే ఎదురవుతున్నది. మళ్లీ స్టే తెచ్చుకుని బదిలీలు ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు సాక్షాత్తూ ఉపాధ్యాయ సంఘాలే ఆరోపిస్తున్నాయి.
హెచ్ఆర్ఏ కోసమే అడ్డంకులా?
పీఆర్సీ నివేదిక ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలోని టీచర్లకు 24శాతం హెచ్ఆర్ఏ అందుతున్నది. జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత పనిచేసే ఉద్యోగులకు 13శాతం, గ్రామీణ ప్రాంతాల్లోని టీచర్లకు 11 శాతం హెచ్ఆర్ఏ వర్తింపజేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేస్తున్న మల్టీజోన్ ఉద్యోగులకు తాజా బదిలీల్లో స్థాన చలనం తప్పని పరిస్థితులున్నాయి. బదిలీలు జరిగితే వీరు రెండు రకాలుగా నష్టపోతారు. జీహెచ్ఎంసీ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడమే కాకుండా, హెచ్ఆర్ఏను కోల్పోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే కొంతమంది టీచర్లు బదిలీలకు మోకాలడ్డుతున్నారని, ఉద్దేశపూర్వకంగా కొందరిని పురమాయించి కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇటీవలి కేసుల్లో కొన్ని