హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టుగా.. ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా, కోర్టు కేసు కారణంగా ఇబ్బందులు పడుతున్న వీఆర్ఏల సమస్య ఓ కొలిక్కి రానున్నది. వీఆర్ఏల నియామకాలను నిలిపి వేయాలంటూ కోర్టులో కేసు వేసిన ఆఫీస్ సబార్డినేట్లు తమ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ప్రభు త్వం గత జూలై 24న ఉత్తర్వులు విడుదల చేసింది.
వారి విద్యాభ్యాసం మేరకు వివిధ శా ఖల్లో సర్దుబాటు చేసింది. దీనిపై రెవెన్యూ శాఖ కు చెందిన 30 మంది ఆఫీస్ సబార్డినేట్లు హై కోర్టును ఆశ్రయించారు. ముందుగా తమకు పదోన్నతులు కల్పించాలని, ఆ తర్వాతే వారి నియామకాలు చేపట్టాలని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆగస్టు 10న వీఆర్ఏల క్రమబద్ధీకరణపై స్టే విధించింది. దీంతో పాత వేతనాలు చెల్లించే పరిస్థితి లేక, ఎంప్లాయ్మెంట్ ఐడీ రాక పేస్కేల్ ప్రకారం కొత్త వేతనాలు దక్కని స్థితి నెలకొన్నది.
ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, వీఆర్ఏ సంఘాల నేతలు కలిసి ఓఎస్లతో పలు దఫాలుగా చర్చలు జరుపగా, శుక్రవారం ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. తాము పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని ఆ 30 మంది ఒప్పుకొన్నారని, వారి నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నామని ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి తెలిపారు.
ఈ మేరకు వారి తరఫు న్యాయవాదికి పిటిషన్ ఉపసంహరణ ప్రక్రియ చేపట్టాలని సూచించినట్టు తెలిపారు. త్వరలో ప్రక్రియ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 20,555 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. న్యాయస్థానంలో ప్రక్రియ పూర్తయితే తమ ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని వారంతా ఆశగా ఎదురుచూస్తున్నారు.