షాద్నగర్: బీజేపీ ప్రభుత్వానికి ఈడీ, సీబీఐ(ED and CBI ) సంస్థలు అనుకూలంగా మారడం విచారకరమని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో నిర్వహించిన ‘రాజ్యాంగం- మనువాదం’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
దేశంలోని అవినీతి రూపుమాపడంలో ప్రధాన పాత్ర పోషించవల్సిన సీబీఐ, ఈడీ వంటి ప్రధాన సంస్థలు బీజేపీ ప్రభుత్వాని(Bjp Government)కి వేట కుక్కలుగా మారి ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం లేని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలను నిర్వీర్యంచేసేందుకు కుట్రలు పన్నుతూ అరాచకాలకు ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని, ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ సామాన్య ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో బీఆర్ఎస్(BRS) పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. దేశంలో మార్పును తీసుకొచ్చేందుకు తమ వంతుగా కృషిచేస్తామని, అందుకు బీఆర్ఎస్ (BRS) నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. బీజేపీ దురాగతాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు సీపీఐ కార్యకర్తలు తీవ్రస్థాయిలో కృషిచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు, జిల్లా కార్యదర్శి జంగయ్య, ఎ. రవీంద్ర, నర్సింగరావు, జంగయ్య, శ్రీను, యాదయ్య, కావలి నర్సింహ, చందు, రామకృష్ణ, పవన్లు పాల్గొన్నారు.