Komatireddy Venkat Reddy | యాదాద్రి భువనగిరి: చదువుకున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. యాదాద్రి భువన జిల్లాలోని బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో బుధవారం పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. అర్హులు ఉంటే యాదగిరిగుట్ట మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. చదువుకున్న యువతకు మెడికల్ కాలేజీలోని ప్రతి డిపార్ట్మెంట్లో ఎంప్లాయిమెంట్ కల్పిస్తామని చెప్పారు.
త్వరలో 60 వేల మంది టీచర్లు రిటైర్ అవుతారని, వాళ్ల స్థానంలో మెగా టీచర్స్ జాబ్ మేళాను సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఈ పోస్టులను ఫిబ్రవరిలో రిక్రూట్ చేయనున్నట్టు వివరించారు. అనంతరం ప్రెసిడెన్సియల్ సూట్లో వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఈవో రామకృష్ణారావు, ఆర్అండ్బీ, వైటీడీఏ అధికారులతో సుమారు గంటన్నరపాటు సమీక్షా సమావేశం జరిపారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థాన అభివృద్ధి, వైటీడీఏ ప్రక్షాళనపై సీఎం రేవంత్రెడ్డితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.