Harish Rao | బీఆర్ఎస్కు విజయాలతో పాటు అపజయాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. గత అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని వ్యాఖ్యానించారు. 2009 లో మనకు పది సీట్లే వచ్చాయని.. ఇక పని అయిపోయిందని కేసీఆర్ ఊరుకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. ఈ ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో హరీశ్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ లేదని కార్యకర్తలు కుంగిపోవద్దని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. భవిష్యత్ లో వచ్చేది మళ్ళీ మనమేనని స్పష్టం చేశారు.
ఇది పరీక్షా సమయం
కాంగ్రెస్ 420 హామీల్లో వాళ్ళు పావలా వంతుకు మించి అమలు చేయలేరని హరీశ్రావు ఎద్దేవా చేశారు. మల్కాజ్గిరిలో పోయిన సారి రేవంత్ తక్కువ ఓట్లతో గెలిచాడని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని రేవంత్ రెడ్డి ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదని.. ఒక్క పైసా నిధులు తీసుకురాలేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈ సారి మనం గెలిచి సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సీట్లను గెలిచామని.. ఇప్పుడు ఎంపీ సీటు కూడా గెలవాలని అన్నారు. ఇది పరీక్షా సమయమని.. మనం పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని వ్యాఖ్యానించారు.
హామీల వాయిదాకు కాంగ్రెస్ కుట్రలు
కర్ణాటకలో ఐదు గ్యారంటీల హామీ ఇచ్చి కాంగ్రెస్ అభాసు పాలైందని హరీశ్రావు అన్నారు. అక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్కు కర్ణాటక లాంటి పరిస్థితే ఉంటుందని జోస్యం చెప్పారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చే లోపే కాంగ్రెస్ హామీలు నెరవేర్చాలి.. కానీ కోడ్ బూచీ చూపి హామీల అమలును కాంగ్రెస్ వాయిదా చేయాలని చూస్తోందని విమర్శించారు.
బీజేపీ గెలుపు పాలపొంగులాంటిదే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అబద్దాలు ప్రచారం చేసి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలిచిందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు పాలపొంగు లాంటిదేనని అసెంబ్లీ ఎన్నికల్లో నగర ఓటర్లు నిరూపించారని స్పష్టం చేశారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు కూడా అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయన్నారు. కీలకమైన పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు అధికారంలో కొనసాగి మళ్లీ అధికారంలోకి రావడం అరుదు అని అన్నారు. రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో ఐదేళ్లకే కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని గుర్తు చేశారు.
చిన్న చిన్న కారణాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయింది
కొన్ని చిన్న చిన్న కారణాలతోనే బీఆర్ఎస్ ఓడిపోయిందని హరీశ్రావు అన్నారు. కార్యకర్తల సూచనలు పరిగణనలోకి తీసుకుని పార్టీని బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని అన్నారు. ఆ రెండు పార్టీల డ్రామాలు ఎండగట్టి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించేందుకు కార్యకర్తలు ఇప్పట్నుంచే నడుం బిగించాలని పిలుపునిచ్చారు.