Job Calender | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): అధికారం కోసం కాంగ్రెస్ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతుందని మరోసారి రుజువైంది. దశాబ్దాలుగా ప్రజల భావోద్వేగాలు, బలహీనతలతో ఆడుకొంటూ వస్తున్న ఆ పార్టీ.. తెలంగాణ ఎన్నికల్లో మరోసారి అదే ఎత్తు వేసింది. యువతను బుట్టలో వేసుకొనేందుకు మేధావులే ఆశ్చర్యపోయే ప్లాన్ వేసింది. యువతలో సహజంగా ఉండే భావోద్వేగాలను ఓట్లుగా మార్చుకొనేందుకు కుట్రలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ‘జాబ్ క్యాలెండర్’ అంటూ కొత్త నాటకం మొదలుపెట్టింది. ‘ఆలులేదు చూలు లేదు.. కొడుకు పేరు అదేదో అన్నట్టు’ ఒకవైపు ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని సొంతపార్టీ నేతలే చేతులెత్తేస్తుండగా.. మరోవైపు దింపుడు కల్లం ఆశలతో యువతను ఆకర్షించేందుకు జాబ్ కాలెండర్ అం టూ మీడియాలో శనివారం ప్రకటలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా నోటిఫికేషన్లు ఇచ్చే తేదీలను కూడా ప్రకటించేసింది. నిజంగా నోటిఫికేషన్లు ఇచ్చేశారన్నట్టుగా యువతను భ్రమింపజేస్తున్నది.
అసాధ్యమని తెలిసీ..
అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటనలు గుప్పించింది. ఒక్క ఏడాదిలో 2 లక్షల జాబ్స్ భర్తీచేయటం అసాధ్యం. వాస్తవానికి జాబ్ క్యాలెండర్ను ఒక పార్టీ లేదా ప్రభుత్వం ప్రకటించవు. రాజ్యాంగబద్ధమైన టీఎస్పీఎస్సీ, ఇతర నియామకపు ఏజెన్సీలు మాత్రమే ప్రకటించాలి. కమిషన్ సభ్యులు, బోర్డు సభ్యులు సమావేశమై పూర్వాపరాలను పరిశీలించి ఎప్పుడు ఏ ఉద్యోగాలను భర్తీ చేయాలో నిర్ణయించి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి. యూపీఎస్సీ సైతం ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నది. రాజ్యాంగబద్ధంగా నియమితులైన కమిషన్, బోర్డు సభ్యులు నిర్ణయించాల్సిన పనిని కాంగ్రెస్ సొంత కార్యక్రమంగా మార్చేసింది. అంటే తాము అధికారంలోకి వస్తే రిక్రూటింగ్ ఏజెన్సీలను తమ జేబు సంస్థలుగా మారుస్తామని చెప్పకనే చెప్పింది. వాస్తవానికి ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వ పాత్ర పరిమితంగా ఉంటుంది. క్యాబినెట్/ ఆర్థికశాఖ అనుమతిచ్చి ఆయా ఉద్యోగాల భర్తీని రిక్రూటింగ్ ఏజెన్సీలకు అప్పగిస్తుంది. రిక్రూటింగ్ ఏజెన్సీలు నోటిఫికేషన్లు జారీచేసి పరీక్షలు నిర్వహించి ఎంపికైనవారి జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తే వారిని ప్రభుత్వం ఉద్యోగులుగా నియమిస్తుంది. ఇలా ప్రకటించే జాబ్ క్యాలెండర్ను ప్రకటించే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు. ఇలా చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం.
మళ్లీ కాంగ్రెస్ కనుసన్నల్లోకేనా?
కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఏపీపీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలనేకం. 2013లో ఏపీపీఎస్సీ ఉద్యోగాలను బహిరంగ మార్కెట్లో అమ్మినట్టుగా బేరానికి పెట్టి సంధ్యారాణి అనే మహిళ ఓ టీవీచానల్కు రెడ్హ్యాండెడ్గా దొరికింది. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలకు బేరంపెట్టగా, దాంట్లో ఏపీపీఎస్సీ సభ్యుడొకరు తనకు రూ.2.5 లక్షలు కమిషన్ ఇస్తానని హామీ ఇచ్చినట్టు ఆమె బహిరంగంగా ఒప్పుకున్నది. నంద్యాల మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ కార్యకర్త, ఆదిలాబాద్ జడ్పీ ఫ్లోర్ లీడర్, చాంద్రాయణ గుట్ట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన వ్యక్తి, సత్తెనపల్లిలో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన వారిని కమిషన్ సభ్యులుగా నియమించిన దాఖలాలున్నాయి. ఏపీపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన రిపుంజయరెడ్డి ఏసీబీ కేసులో ఇరుక్కున్నారు. 1980లో రాజాజీ అనే ఐఏఎస్ అధికారిని ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించారు. నిప్పులాంటి మనిషిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. కమిషన్ చైర్మన్గా నియమితులైన 3 నెలలకే ఆయన రాజీనామా చేశారు. అక్రమాలను సహించలేక, ఒత్తిళ్లకు లొంగలేక రాజీనామా చేశారు.
అలా జరిగితే..ఇలా మోసపోవాల్సిందే
గ్రూప్-1 నోటిఫికేషన్ను 1-2024న జారీచేస్తామని జాబ్ క్యాలెండర్లో కాంగ్రెస్ ప్రకటించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గ్రూప్ -1 ఉద్యోగాల సంఖ్య 503 మాత్రమే. ఇప్పటికే ఈ 503 గ్రూప్-1 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించాల్సి ఉన్నది. ఖాళీ పోస్టులు లేకుండా మళ్లీ గ్రూప్ -1 నోటిఫికేషన్ను ఎలా విడుదల చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మళ్లీ నోటిఫికేషన్ జారీచేయడమంటే పాత నోటిఫికేషన్ను రద్దుచేయడమే. అంటే నిరుద్యోగులను మళ్లీ మోసగించడంలో భాగమేనన్నది సుస్పష్టం.
9,168 గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేయడమే కాకుండా రాత పరీక్షను నిర్వహించగా, ఫలితాల వెల్లడి మాత్రమే మిగిలి ఉన్నది. ఈ తరుణంలో 1-6-24, 1-12-24 తేదీల్లో రెండు విడుతల్లో నోటిఫికేషన్లు జారీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. అంటే పాత నోటిఫికేషన్ను తుంగలో తొక్కడమే అవుతుంది. అసలు ఇలా ఒక నోటిఫికేషన్ను రద్దుచేసే అధికారం కూడా టీఎస్పీఎస్సీకే ఉంటుంది. తాజా పరస్థితుల్లో రద్దుచేయడం సాధ్యమేనా? అలా చేస్తే పరీక్షరాసిన వారి సంగతి ఏమిటి? ఇలా చేస్తే మళ్లీ కోర్టుకేసులు, వివాదాలతో తమ చేతికి మట్టి అంటకుండా ..ఉద్యోగాలు భర్తీ కాకుండా.. నిరుద్యోగుల నోట్లో మట్టికొట్టేందుకే కాంగ్రెస్ ఈ నాటకం ఆడుతున్నదని మేధావులు విమర్శిస్తున్నారు.
ఇప్పటికే గ్రూప్ -2లో ఖాళీగా ఉన్న 783, గ్రూప్ -3 క్యాడర్లోని 1,365 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల్లో ఖాళీలు ఉత్పన్నమయ్యే సమస్యేలేదు. ఏడాదికి ఒకసారి గ్రూప్ – 1, ఏడాది రెండుసార్లు గ్రూప్ 2, 3,4 నిర్వహిస్తామని చెప్పడం ఆచరణసాధ్యం కూడా కాదు. దేశ చరిత్రలో ఇది వరకు ఎక్కడా జరగలేదు. సాంకేతికకంగా ఎక్కడా సాధ్యపడదు కూడా.
మరో దారుణమైన విషయం ఏంటంటే జూనియర్, పాలిటెక్నిక్ డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. కొన్నింటికి పరీక్షలు సైతం నిర్వహించారు. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన క్యాలెండర్లో కాలేజీ కమిషన్ రిక్రూట్ చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో ఇలాంటి నియామక సంస్థ అనేదే లేదు. ఇదంతా పూర్తిగా నిరుద్యోగులను మోసపుచ్చే, మభ్యపెట్టే వ్యవహారమనేందుకు ఈ ఒక్క నిదర్శనం చాలు.
అసిస్టెంట్ మెటార్ వెహికిల్, టీచర్, గురుకుల ఉద్యోగాలు సహా కాంగ్రెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న ఉద్యోగాలన్నింటికి టీఎస్పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదలచేసింది. నియామక ప్రక్రియ ఏదో ఒక దశలో ఉన్నది. అయినా తాము ఏదో పొడిచేస్తాం అన్నట్టుగా ప్రకటనలు గుప్పించడం అంటే ఉద్యోగార్ధులను మోసం చేయడమేనని స్పష్టమవుతున్నది.
2024 మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలొచ్చే అవకాశమున్నది. ఎన్నికల కోడ్ సమయంలో నోటిఫికేషన్లు ఇవ్వడం అసాధ్యం. శనివారం ఇచ్చిన ప్రకటనలో 2024 ఫిబ్రవరి నుంచి మే వరకు తేదీలను ప్రకటించింది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలివ్వడమంటే ఉద్యోగార్ధులు, యువతను మభ్యపెట్టడమే అవుతుంది.