Srinivas Goud | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటికావడం అసాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తలతో శ్రీనివాస్ గౌడ్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే అన్ని వర్గాలకు సమ న్యాయం జరిగిందన్నారు. అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
తాగునీరు, కరెంట్ కోసం ఈ పదేండ్లల్లో ఎప్పుడూ ధర్నాలు చేయలేదని, నేడు అదేపనిగా నిరసన బాట చేపడుతున్నారని, కాంగ్రెస్కు ఓటేసే ముందే ఆలోచించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆగస్టు 15 వరకు చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల ముందే రుణమాఫీ చేయని ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ముందు చేస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటిగా పనిచేసి ప్రజలను విభజించి ఓట్లు దండుకున్నారంటూ విమర్శించారు. భూమి, ఆకాశం, తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసే అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.