హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో మొత్తం 123 మంది గిరిజన విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్స్ కు సెలెక్ట్ అవ్వడం సంతోషకరమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెలెక్ట్ అయిన విద్యార్థులను బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని డీఎస్ఎస్ భవన్ లో అభినందించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు, రాజేంద్రనగర్ స్టడీ సర్కిల్ , రాష్ట్రంలోని ఇతర ఎస్టీ స్టడీ సెంటర్ లలో కోచింగ్ తీసుకుని మెయిన్స్ కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు మాత్రమే ట్యాబ్ లతో పాటు, ప్రతినెల ఐదు వేల రూపాయల స్టయిఫండ్ ను అందిస్తామని అన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు సిద్ధమవుతున్న ఈ విద్యార్థులకు రెసిడెన్షియల్ సౌకర్యంతో పాటు మెరుగైన కోచింగ్ అందజేస్తామని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమాలకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. విద్య విషయంలోనూ గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. దానిలో భాగంగానే ప్రాథమిక విద్య మొదలు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీతో పాటు వృత్తి విద్యాకోర్సులను అభివృద్ధిపరుస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలతో విద్యార్థులు తమ ప్రతిభను , విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటుతున్నారని అన్నారు. విద్యార్థులకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి అన్ని రకాల సౌకర్యాలను అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అందజేసే అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, జిసిసి జిఎం సీతారాం నాయక్, జేడీ సబుజ్వల, స్టేట్ మిషన్ మేనేజర్ ట్రైకర్ లక్ష్మీప్రసాద్, ఇందిరా, అధికారులు తదితరులు పాల్గొన్నారు.