50 మందికి నియామక పత్రాలు
అందజేసిన ఎన్టీటీ డాటా కంపెనీ
అభినందించిన మంత్రి కేటీఆర్
ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీల రాకపై హర్షం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 5 : ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ కంపెనీ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్టీటీ డాటా కంపెనీ ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన 50 మంది యువతీ యువకులకు శనివారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేసింది. దీనిపై ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ కం పెనీ ఏర్పాటు కల నెరవేరుతున్నదని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో ఐటీ టవర్ ఏర్పాటుకు పునాది పడిందని పేర్కొన్న కొద్ది రోజుల్లోనే అది సాకారమవ్వడంపై ట్విట్టర్లో ఆనందం వ్యక్తంచేశారు. యువతకు నియామక పత్రాలను అందజేసిన ఫొటోలను మంత్రి షేర్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిరుద్యోగ యు వతకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. తమ కంపెనీలో జిల్లా నుంచి మరో 300 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కృషి వల్లే తమకు అవకాశం వచ్చిందని ఉద్యోగాలు వచ్చినవారు సంతోషంగా తెలిపారు.