హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): వర్క్ ఫ్రం హోం విధానానికి ఐటీ కంపెనీలు క్రమంగా వీడ్కోలు పలుకుతున్నాయి. చాలా కంపెనీల్లో ఉద్యోగులు వారంలో కనీసం రెండు, మూడు రోజులు కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించే (రిటర్న్ టు ఆఫీస్-ఆర్టీవో) విధానం క్రమంగా పెరుగుతున్నది. దాదాపు 34% కంపెనీల్లో 60 శాతానికి పైగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పి.. కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తున్నట్టుగా హైసియా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) సర్వేలో వెల్లడైంది.
హైదరాబాద్ ఐటీ, ఐటీఈఎస్, వాటి అనుబంధ రంగాల్లోని కంపెనీలపై గత మార్చిలో హైసియా నిర్వహించిన సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఐదు వందల నుంచి ఐదు వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్న కంపెనీలకు సర్వేకు ఎంచుకున్నారు. అత్యధిక కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు హైసియా నివేదిక పేర్కొన్నది.