హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వెన్నెముక లేని నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి వల్ల రాష్ర్టానికి ఎలాంటి ఉపయోగం లేదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు, ప్రధాని నరేంద్రమోదీ తీరుపై మంత్రి కేటీఆర్ గురువారం వరస ట్వీట్లు చేశారు. రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన రైల్వే కోచ్ఫ్యాక్టరీ, పసుపుబోర్డు, మెట్రో రెండో దశ, ఐటీఐఆర్ ప్రాజెక్టు వంటి ప్రధాన డిమాండ్లను లోక్సభ వేదికగా తుంగలో తొక్కినా ఒక్క బీజేపీ ఎంపీ కూడా నోరు మెదపలేదని మండిపడ్డారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం హామీల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నదంటూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక రాసిన కథనాన్ని ఆయన ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం దారుణంగా ఉల్లంఘించినందుకు తెలంగాణకు చెందిన నలుగురు వెన్నెముక లేని బీజేపీ ఎంపీలు జవాబుదారీగా ఉండాలి. తెలంగాణకు కోచ్ఫ్యాక్టరీని నిరాకరించి, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్కు రూ.20 వేల కోట్ల లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితమిది’ అంటూ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మన ప్రాధాన్యాల్ల్లో మోదీ ఎందుకు?
లోక్సభా వేదికగా తెలంగాణకు ఏమీ ఇవ్వబోమని కరాఖండిగా తేల్చి చెప్పిన ప్రధాని, అతని మంత్రివర్గంపై కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. తెలంగాణకు ఏమీ ఇవ్వబోమని చెప్పిన ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ప్రాధాన్యాల్లో ఎందుకు ఉండాలి? అని సూటిగా ప్రశ్నించారు.
తెలంగాణకు.. కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం
నిజామాబాద్కు పసుపు బోర్డు ఇవ్వం
హైదరాబాద్ మెట్రో రెండో దశ ఇవ్వం
రాష్ర్టానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం
బయ్యారం ఉకుఫ్యాక్టరీ ఇవ్వం
ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వం
ఇలా ప్రధాని ప్రాధాన్యాల్లో అసలు తెలంగాణే లేనప్పుడు, రాష్ట్ర ప్రజల ప్రాధాన్య క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి? తెలంగాణలో ఆ దికుమాలిన పార్టీ ఎందుకు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.