హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్మాణాల నాణ్యత, టెండర్లలో పాటిస్తున్న పారదర్శకతకు మెచ్చి ‘ఐఎస్వో 9001:2015’ సర్టిఫికెట్ను జారీ చేసింది. మెడికల్ కాలేజీలు, దవాఖానల డిజైన్లు, నిర్మాణాల్లో అత్యుత్తమ ప్రమాణాలను పాటించడంతోపాటు అన్ని దవాఖానలకు ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర సామగ్రి కొనుగోలులో టీఎస్ఎంఎస్ఐడీసీ పారదర్శకంగా వ్యవహరిస్తున్నందుకు ఈ సర్టిఫికెట్ లభించింది. తద్వారా దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న కార్పొరేషన్లలో టీఎస్ఎంస్ఐడీసీకి స్థానం దక్కింది.
ఈ సర్టిఫికెట్ కాలవ్యవధి మూడేండ్లు. తెలంగాణను ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాలో ఓ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ లక్ష్యాల సాధనలో టీఎస్ఎంఎస్ఐడీసీ కీలక పాత్ర పోషిస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటివరకు 21 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. వీటికి అనుమతులను పొందేందుకు కఠినమైన ఎన్ఎంసీ ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు మార్గనిర్దేశంలో టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమించి అన్ని మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధించారు. దీంతో నిరుడు సీఎం కేసీఆర్ ఒకేసారి 8 వైద్య కళాశాలల్లో తరగతులను ప్రారంభించి దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ రికార్డును అధిగమించేలా ఈ ఏడాది 9 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి.
రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానల్లో సరైన సదుపాయాలు ఉండేవి కాదు. వాటిలో అత్యధిక దవాఖానలు పాత భవనాల్లోనే నడిచేవి. వాటి నిర్వహణ, మరమ్మతులు సరిగా లేక ఎప్పుడు ఏ పెచ్చు ఊడి పడుతుందోనన్న ఆందోళన అందరిలోనూ ఉండేది. అంతేకాకుండా ఆయా దవాఖానల్లో సరిపడినన్ని మందులు అందుబాటులో లేక రోగులు సగం చికిత్సతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చేది. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత అత్యాధునిక భవనాలు అందుబాటులోకి వస్తున్నాయి. ‘ఈ-ఔషధి’ ద్వారా కనీసం 3 నెలలకు సరిపడా అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటున్నాయి. దేశంలోనే తొలిసారి ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీని తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. వైద్య పరికరాల నిర్వహణకు టీఎస్ఎంస్ఐడీసీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పరికరాలు పాడైన వెంటనే మరమ్మతులు జరిగిపోతున్నాయి. ఫలితంగా రాష్ట్ర వైద్యారోగ్య రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. వీటన్నిటికీ గుర్తింపుగానే ఇప్పుడు టీఎస్ఎంఎస్ఐడీసీకి ఐఎస్వో సర్టిఫికెట్ లభించింది.
టీఎస్ఎంఎస్ఐడీసీకి ఐఎస్వో సర్టిఫికెట్ రావడం హర్షణీయం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు, ఆరోగ్య తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నాం. మెడికల్ కాలేజీల నిర్మాణంతోపాటు ఔషధాలు, వైద్యపరికరాల కొనుగోళ్లను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పురోగతిని పరిశీలిస్తున్నారు. అవసరమైన సలహాలు ఇస్తున్నారు. వారిద్దరి స్ఫూర్తితో మా అధికారులు, సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. టీఎస్ఎంఎస్ఐడీసీని దేశంలోనే అత్యుత్తమ కార్పొరేషన్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో ఐఎస్వో సర్టిఫికెట్ రావడం మా ప్రయాణంలో గొప్ప మైలురాయిగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా.
– ఎర్రోళ్ల శ్రీనివాస్, టీఎస్ఎంస్ఐడీసీ చైర్మన్