హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎక్స్రే పొలారి మీటర్ ఉపగ్రహం (ఎక్స్పోశాట్)ను పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. 25 గంటల కౌంట్డౌన్ తర్వాత సోమవారం ఉదయం 9:10 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. దీని ద్వారా భారత్కు చెందిన 480 కిలోల ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపించారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్ పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగంలో కేరళలోని తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ పేలోడ్లు కూడా ఉన్నాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు.
ఈ ఎక్స్ పోశాట్ ప్రయోగం భారత అంతరిక్ష ఆధారిత ఎక్స్రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి తొలి అడుగు కానుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా ఇమేజింగ్, టైం-డొమైన్ అధ్యయనాలు, స్పెక్ట్రోసొపీపై దృష్టి సారించిన గత ప్రయోగాల లాగా కాకుండా.. ఎక్స్రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తుందని శాస్త్రవేత్తలు పేరొన్నారు. ఎక్స్రే మూలాలను అన్వేషించడం ఎక్స్ పోశాట్ లక్ష్యమని తెలిపారు. అయితే ఇలాంటి ప్రయోగం ప్రపంచంలోనే రెండోదని.. భారత్ కంటే ముందు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మాత్రమే ఇలాంటి ప్రయోగం చేసిందని వెల్లడించారు. అగ్రరాజ్యం 2021లో ఐఎక్స్పీఈ పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించినట్లు పేరొన్నారు.
ఎక్స్ పోశాట్ జీవితకాలం అయిదేళ్లు. కృష్ణబిలాలను అర్థం చేసుకోవడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. ఎక్స్రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్కు సంబంధించిన వివరాలను ఎక్స్పోశాట్ బహిర్గతం చేస్తుంది. పీఎస్ఎల్వీ చివరి దశలో మరో 10 పరికరాలను నింగిలోకి మోసుకెళ్లింది. దీనికి పీఎస్ఎల్వీ ఆర్బిటల్ ఎక్స్ పెరిమెంటల్ మాడ్యూల్ అని పేరు పెట్టారు.
సొంత అంతరిక్ష కేంద్రం దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. సరికొత్త ఫ్యూయెల్ సెల్ను దిగువ భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ సీ58 ద్వారా ఎక్స్పోశాట్తోపాటు మరో 10 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. వాటిలో ఈ ఫ్యూయెల్ సెల్ పవర్ సిస్టమ్ కూడా ఒకటి. రోదసిలో సమర్థవంతమైన శక్తి వనరును భారత్కు అందించడానికి ఇది దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. సుదీర్ఘ కాలం ఇది స్పేస్ స్టేషన్కు ఇది కరెంట్ సరఫరా చేయగలదని చెప్పారు.
కొత్త ఏడాదిలో కొత్త విజయాన్ని అందుకున్నామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అన్నారు. ‘పీఎస్ఎల్వీ-సీ58 వాహన నౌక ఎక్స్పోశాట్ను నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది ఆరంభం మాత్రమే. ఈ ఏడాది మరిన్ని కీలక ప్రయోగాలున్నాయి. ఈ ఏడాది.. గగన్యాన్ సంవత్సరంగా నిలిచిపోతుంది’ అని పేర్కొన్నారు.
ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రయోగంలో పాలుపంచుకున్న ప్రతి ఒకరికీ అభినందనలు తెలిపారు. వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బ్లాక్ హోల్స్ను అధ్యయనం చేయడానికి అమెరికా తర్వాత అబ్జర్వేటరీ ఉపగ్రహం ఉన్న రెండో దేశంగా భారతదేశం అవతరించిందని సీఎం చెప్పారు. కొత్త సంవత్సరం మొదటి రోజే మిషన్ను విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో రోదసిలో భారత పతాకాన్ని ఘనంగా ఎగురవేసిందన్నారు. పీఎస్ఎల్వీ- సీ58 విజయవంతంగా ప్రయోగించడంతో ఇస్రో మరో శిఖరం చేరిందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఎక్స్పోశాట్ ప్రయోగంలో హైదరాబాద్కు చెందిన అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కీలక పాత్ర పోషించింది. ప్రయోగానికి అవసరమైన కీలక పరికరాలను ఈ సంస్థ సరఫరా చేసింది. స్టార్ సెన్సన్, ఆల్టిట్యూడ్ ప్రాసెసింగ్ యూనిట్, అడ్వాన్స్డ్ టెలిమెట్రీ సిస్టమ్, అడ్వాన్స్డ్ డాటా అక్విజిషన్ మాడ్యూల్స్, పైరో కంట్రోల్ సిస్టమ్స్ తదితరవాటిని అందజేసింది.